మహబూబ్నగర్ టౌన్, జూన్ 24 : అసలే వానకాలం.. ఉరుములు, మెరుపులతోకూడిన వర్షానికి దూసుకొచ్చే పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడుతాయో తెలియని పరిస్థితి. పిడుగుపాటుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం వచ్చే సమయంలో ముందస్తు జాగ్రత్తలతోనే ముప్పు తప్పుతుంది. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమను తాము రక్షించుకోవాలి.
చెట్ల కిందకు వెళ్లొద్దు..
వర్షం పడే సమయాల్లో పిడుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు వర్షం బారి నుంచి తప్పించుకునేందుకు చెట్ల కిందకు పరుగులు పెడుతుంటారు. ఇది ప్రమాదకరం. పచ్చనిచెట్టు పిడుగుకు మంచి వాహకాలుగా పనిచేస్తాయి. వీటివైపు పిడుగు త్వరగా ప్రవేశిస్తుంది. ఎత్తైన చెట్లు ఉండే ప్రాంతాలు పిడుగుపాటుకు అనుకూలం. ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు ఎవరూ వెళ్లొద్దు.
సెల్ఫోన్ మరీ ప్రమాదం..
వర్షం కురుస్తున్నప్పుడు సెల్ఫోన్ వినియోగించకూడదు. వర్షంలో ఫోన్ మాట్లాడాలని ప్రయత్నిస్తే ముప్పును ఆహ్వానించినట్టే. సెల్ఫోన్లోకి ప్రవేశించే విద్యుదయస్కాంత తరంగాలు కూడా పిడుగును ఆకర్షిస్తాయి. దీంతో ఈ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్షణ చర్యలు..
పిడుగు ఎత్తైన ప్రదేశాలు, భారీ భవనాలపై పడే అవకాశాలు ఉంటాయి. అయితే కాపర్, బ్రాంజ్ మిశ్రమంతో తయారు చేసిన లైటేనింగ్ కండక్టర్ భవనాలపై ఉంచి భూమిని అనుసంధానం చేయడంతో పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చు. ఇందుకు బలమైన విద్యుదావేశాన్ని లైటేనింగ్ కండక్టర్ ఆకర్షించి ప్రమాదం చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. లైటేనింగ్ కండక్టర్తో పిడుగు దారి మళ్లుతుంది.
అప్రమత్తంగా ఉండాలి
వర్షం పడే సమయాల్లో చెట్ల కిందకు వెళ్లడం మంచిది కాదు. ఖాళీ స్థలాల్లో భూమిపై కూర్చోవడం లేదా పడుకోవడం గానీ, చెవులను రెండు చేతులతో గట్టిగా మూసుకోవాలి. పిడుగు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
భూమిపై పడుకోవడం ఉత్తమం
ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం పడే సమయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగు పడే అవకాశం ఉంటే వెంటనే ఖాళీ స్థలంలో భూమిపై పడుకోవడం ఉత్తమం. పిడుగుపాటుకు గురైనవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.