మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్23: ప్రతి మండల కేంద్రంలో మెగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ మండలం చౌదర్పల్లి, కోటకదిర తదితర గ్రామాల్లో పర్యటించి హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్డులను తనిఖీ చేశారు. కోటకదిర నర్సరీలోని కానుగ, మందారం, జామ, గుల్మోహర్, బాదం, ఖర్జూరం మొక్కలను పరిశీలించారు. చౌదర్పల్లి సర్వే నంబర్ 127లో పదెకరాల స్థలంలో మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో పది ఎకరాల్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద మెగా ప్రకృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో వేదావతి, తాసిల్దార్ పాండు, జ్యోతి, ఎంపీడీవో నరేందర్రెడ్డి, సర్పంచ్ మల్లు రమ్యదేవేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సురేశ్, మౌనిక పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ వెంకట్రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రోగ్రాం అధికారుల రోజువారీ కార్యక్రమాలను సమీక్షించారు. జూలై 1నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అవుతున్నందునా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఆశకార్యకర్తలు ప్రజల నుంచి ప్రతి నెలా సేకరించిన బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారి వివరాలపై సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శంకర్, డాక్టర్ సంధ్యకిరణ్మయి, జరీనా పాల్గొన్నారు.
ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలి
హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కలను తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయడమేగాక రికార్డ్ చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమలో భాగంగా అన్ని కార్యాలయాల కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, జెడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.