పెబ్బేరు రూరల్, మే 16 : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కొనసాగుతున్నది. మనం మార్కెట్కు వెళ్తే చాలు కుప్పలు కుప్పలుగా మామిడి పండ్ల రాశులు మనకు కనిపిస్తాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాలు, రకానికో రుచి ఉంటుంది. అయితే చెట్టుమీదే మాగిన పండుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా చెట్టుకు కాసిన మామిడి కాయలను తెంచి వాటిని కృత్రిమంగా మాగబెడుతుంటారు. ఇందుకు గానూ రసాయనాలను వినియోగిస్తారు. కాయలన్నింటినీ గాలి దూరని గదిలో ఉంచి వాటి మధ్యలో రసాయనిక మందులు ఉంచితే రెండు మూడు రోజుల్లో పక్వానికొచ్చి బాగా మాగుతాయి. ఆ పండ్లు కంటికి ఇంపుగా రంగుతేలి కనిపిస్తుండటంతో జనం విరగబడి కొంటారు. ఇలాంటి పండ్లు తింటే ఎన్నో అరోగ్య సమస్యలోస్తాయని వైద్యులు చెబుతున్నారు. కానీ విధిలేని పరిస్థితుల్లో జనం వీటిని తినాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రకృతిపరంగా పండ్లను మాగబెట్టే పద్ధతులు కనుమరుగయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా పండ్లు మాగాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న పనికావడంతో అందరూ దీన్ని వదిలేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు మామిడి తోటల యజమానులు చెట్టుమీదే పండ్లను మాగబెట్టి మరీ అమ్ముతున్నారు. వీటికి ధర ఎక్కువతో పాటు బాగా డిమాండ్ కూడా ఉంది.