రేపు డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
అందుబాటులో 57రకాల వైద్య పరీక్షలు
అత్యాధునిక పరికరాలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 7 : తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలను ఉచితంగా పొందవచ్చని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా డయాగ్నొస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలతోపాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డయాగ్నొస్టిక్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా 9న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డయాగ్నొస్టిక్ కేంద్రంతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.
అధునాతన యంత్రాలతో ఒకేసారి 400 నుంచి 800 రిపోర్టులు పొందే అవకాశం ఉందని తెలిపా రు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, ఇతర దవాఖానల్లో చికిత్స పొందే రోగులకు కూడా డయాగ్నొస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవ లు అందించేందుకు డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. డయాగ్నొస్టిక్ సెంటర్కు వచ్చే రోడ్డును విస్తరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెంటెంట్ జీవన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, మెడికల్ కళాశాల ఎస్పీఎం కిరణ్ పాల్గొన్నారు.
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
మహబూబ్నగర్, జూన్ 7 : జర్నలిస్టులు ప్రపంచ సమాచారాన్ని అనుక్షణం ప్రజలకు చేరవేస్తూ సమాజం లో కీలకంగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులను సోమవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులందరూ తన అన్నదమ్ములతో సమానమని, అందరం ఐక్యంగా ఉంటూ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. శాంతానారాయణగౌ డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలను అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. కొవిడ్ థర్డ్వేవ్ మొదలు కానున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు పాషా, కిశోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజేశ్వర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.