వనపర్తిలో రూ 19.50కోట్లతో సమీకృత మార్కెట్
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ఎంపీ రాములుతో కలిసి శంకుస్థాపన
వనపర్తి, మే 3: పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అధికారులు ,నాయకులతో కలిసి సోమవారం మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మంత్రి నిరంజన్రెడ్డికి పూర్ణకుంభంతో వేదపండితులు , మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ , టీఆర్ఎస్వీ జోగుళాంబ గద్వాల జిల్లా కో ఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, పలువురు నాయకులు పూలబొకేలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక ఉండాలని, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పన జరుగాలన్నది సీఎం ఆకాంక్ష అన్నారు. భవిష్యత్ జనాభాను దృష్టిలో ఉంచుకుని సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే వనపర్తి నడిబొడ్డున గల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ 19.50 కోట్లతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. సమీకృత మార్కెట్ను రెండస్తులతో 85వేల చదరపు మీటర్ల విస్తీర్ణం లో నిర్మిస్తున్నామని, ఇందులో 70 వ్యాపార దుకాణాలు, 120 కూరగాయల దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, చిల్డ్రన్ పార్కు, 28 నాన్ వెజ్ దుకాణాలు, పండ్ల దుకాణాలు ఉండేలా నిర్మాణాలను చేపడతున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రం మర్రికుంట వద్ద గల ఎకో పార్కు సమీపంలో ఎకరా స్థలంలో రూ.3 కోట్లతో వే సైడ్ మార్కెట్, రూ.కోటీ40లక్షలతో పాత బస్టాండ్లో మరో సమీకృత మార్కెట్ నిర్మాణాలను చేపడుతామన్నారు. విలీన గ్రామాలైన నాగవరం, రాజనగరం సమీపంలో మరో మార్కెట్ నిర్మాణం చేస్తామన్నారు. పట్టణంలో 1500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో వనపర్తి పట్టణ పేదల జీవితాల్లో సమూలమైన మార్పు వస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సాగునీటి లభ్యత పెరగడంతో పంటల దిగుబడి పెరిగిందని, చిట్యాల వద్ద నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి , వేరుశనుగ, గొర్రెల పరిశోధన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకుంటామన్నారు. ప్రజలు, నాయకుల ప్రేమాభిమానులతో కరోనాను జయించి తిరిగి ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చానని మంత్రి తెలిపారు. సమీకృత మార్కెట్తో ప్రజలు, రైతులకు ఎంతో ఉపయోగమని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములు అన్నారు. సీఎం కేసీఆర్ కలగన్న తెలంగాణ కోసం అందరం కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్లు లక్ష్మారెడ్డి, శ్యామల, వైస్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కరుణశ్రీ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య , గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.