నాగర్కర్నూల్ జిల్లా కోనసీమను తలపిస్తున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో సాగును సంబురంగా చేపడుతున్నారు. సమైక్య పాలనలో ఎంజీకేఎల్ఐను నిరాదరణకు గురిచేయడంతో వ్యవసాయం దండగలా మారింది. గ్రామాల నుంచి పట్నాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ కల సాకారం కావడంతో ఇప్పుడు జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యంగా 2016-17లో జిల్లా ఆవిర్భావం నుంచి ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలోనూ అంతకు మించిన స్థాయిలో పంటల సాగు, దిగుబడులు పెరుగుతూ వస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేయడమే. ఈ ఎత్తిపోతల నుంచి కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు సాగునీరు అందుతున్నది. అదనంగా వనపర్తిలో ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్తోపాటు కొత్తగా అచ్చంపేటలో చంద్రసాగర్, ఉమామహేశ్వరం, బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్లు ఏర్పాటు కానున్నాయి. ఇక ప్రభుత్వం రూ.120 కోట్లతో 24 గంటలపాటు జిల్లాలో 85 వేల వ్యవసాయ బావులకు ఉచితంగా నిరంతర విద్యుత్ను అందజేస్తున్నది. 143 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించింది. ఇక రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో రూ.700 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నది. రైతులు మృతి చెందితే రైతుబీమా కింద రూ.5 లక్షల సాయం అందజేస్తున్నది.
అలాగే సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటలు చేతికి వచ్చిన ప్రతిసారి గ్రామాల్లోనే సింగిల్విండోలు, మహిళా సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. సేకరించిన పంటకు వారం వ్యవధిలోనే నేరుగా రైతులకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నది. అలాగే పంటల బీమా, రుణమాఫీ, కొత్తగా రుణాలు, యాంత్రీకరణ వంటి పథకాలతో జిల్లాలో వ్యవసాయంపై రైతుల ఆసక్తి పెరిగింది. దీంతో గతంలో ఎకరం రూ.50వేల నుంచి రూ.లక్ష ఉన్న భూములు ఇప్పుడు దాదాపుగా రూ.25 లక్షలకు చేరాయి. రోడ్ల పక్కన ఉన్న భూములు రూ.40లక్షల వరకు పెరిగాయి.
దీంతో పట్టణాలు, గ్రామాల్లో నివాస స్థలాల ధరలు సైతం మూడింతలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధే. ఇలా నాగర్కర్నూల్ జిల్లాలో పత్తి, వరి, వేరుశనగవంటి పంటలతో భూములు పచ్చగా కనిపిస్తున్నాయి. రెండు సీజన్లలోనూ చెరువులు, కుంటల్లో నీళ్లు నిండుగా పారుతూ వ్యవసాయానికి ఆదెరువుగా నిలుస్తున్నాయి. రైతులు వలసలు వీడారు. సొంతూళ్లలోనే తమ పొలాల్లో వ్యవసాయ పనులు, అనుబంధ కూలీ పనులు చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. వ్యవసాయం బాగా పెరగడంతో జిల్లా కేంద్రంలో వివిధ రకాల ట్రాక్టర్ల షోరూంలు, యాంత్రీకరణ వ్యాపారాలు జోరందుకున్నాయి. ఈ వానకాలంలో జిల్లాలో 6,35,502 ఎకరాల్లో పంటల సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ఏర్పడ్డాక నాగర్కర్నూల్ జిల్లా వ్యవసాయంలో రాష్ట్రంలోనే ప్రముఖ స్థానంలో నిలుస్తున్నది.