కోడేరు, మే 26 : రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంత భూముల్లో రైతులు అక్రమంగా సాగు చేస్తున్న మామిడి మొక్కలను తొలగిస్తుండగా.. అధికారులను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని నర్సాయిపల్లి అటవీ ప్రాంతంలో కొందరు రైతులు భూములను అక్రమంగా సాగు చేశారని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జిల్లా అటవీశాఖ అ ధికారులు గురువారం స్పందించారు. అటవీ భూముల్లో సాగు చేస్తున్న చెట్లను తొలగించాలని కొల్లాపూర్ ఫారెస్ట్ అధికారులను ఆదేశించగా.. కొల్లాపూర్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ పద్మారావు, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య, సిబ్బంది అడవిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 20 మామిడి మొక్కలను తొలగించడంతో రైతు లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
1977 నుంచి భూమి ని సాగు చేసుకుంటున్నామని.. ఇప్పుడు వచ్చి మొక్కలను తొలగిస్తే ఎలా అని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నామన్నారు. 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న వారి మామిడి తోటలను తొలగిస్తే.. తాము కూడా స్వచ్ఛందంగా మొక్కలను తొలగిస్తామన్నారు. చిన్న, సన్న కారు రైతులం అందరం కలిసి రెండెకరాలు సాగు చేసుకుంటే.. పెద్ద కారు రైతులు ఐదు నుంచి పదెకరాల వరకు అక్రమంగా సాగుచేస్తున్నారన్నారు. ఒక్క సెంటు భూమి కూడా లేని తమకు పట్టాలు ఇచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు. డిప్యూటి రేంజర్ పద్మారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల వద్దకు వచ్చి తమ గోడు వినిపించాలని చెప్పి వెనుదిరిగారు.