జడ్చర్ల, మే 26 : పుడమితల్లి సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని జడ్చర్ల బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసులు అన్నారు. ఈషా ఫౌండేషన్ చేపట్టిన ‘మట్టిని కాపాడుకుందాం’ ఉద్యమంలో భాగంగా గురువారం డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, ఎకోక్లబ్, తెలుగు, రసాయనశాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బతుకునిచ్చే నేలను బతకనిద్దాం’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మట్టిలో పూతికాహారులే లేకపోతే పూడ్చిన మృతదేహాలను ప్రతి సంవత్సరం పలుకరించుకునే పరిస్థితి ఉండేదన్నారు. అప్పుడు నేలంతా మృతదేహాల దిబ్బగా మారి నివాసయోగ్యం కాకుం డా పోయేదన్నారు. నేలతల్లిని కన్నతల్లికంటే మిన్నగా భావించే మన సంస్కృతిలో నేలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని పుడమితల్లిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు సదాశివయ్య, సుభాషిణి, రమాదేవి, యాద య్య, వెంకటేశ్వర్లు, విక్రంకుమార్, మాధవి, అనిత, శ్రీను, బాలరాజు, విఠల్, భార్గవీలత పాల్గొన్నారు.