మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 5 : మహబూబ్నగర్ జిల్లాకు మహర్దశ పట్టనున్నది. జోగుళాంబ జోన్కు డీఐజీ కార్యాలయం పాలమూరులో ఏర్పాటు కానున్నది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పోలీసు శాఖ పర్యవేక్షణ పాలన ఇక్కడి నుంచే కొనసాగనున్నది. ఈ జోన్కు డీఐజీని ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి జిల్లా నుంచి పోలీసులు కార్యాలయానికి రానుండగా.. పోలీస్ శాఖలో పూర్వ వైభవం సంతరించుకోనున్నది. శుక్రవారం ఉదయం 11 గంటలకు డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన జోన్లలో జోగుళాంబ ఏడోది. ఈ జోన్ ఏర్పడి నాటి నుంచి నేటి వరకు ఐజీగా ఉన్న కమలాసన్రెడ్డి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
కొత్తగా 2009 బ్యాచ్కు చెందిన చౌహన్ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాకు కొత్త పోలీస్ బాస్ రానుండడంతో శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అంశాలపై పర్యవేక్షణ చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా డీఐజీ కార్యాలయాన్ని పాత ఎస్పీ చాంబర్లో ఏర్పాటు చేశారు. సీసీ చాంబర్తోపాటు జోన్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి ఇద్దరు, ముగ్గరు స్టాఫ్ను ఇక్కడికి కేటాయించే అవకాశం ఉన్నది. ఉద్యోగుల సర్వీసు విషయాలన్నీ డీఐజీ పర్యవేక్షణ చేయనున్నారు. హెడ్కానిస్టేబుల్ బదిలీలతోపాటు ఎస్సై స్థాయి అధికారులనూ బదిలీ చేసే అవకాశం ఉన్నది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర విషయాలూ డిఐజీ కార్యాలయం ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులకు విధుల్లో భాగంగా సాగనున్నాయి. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందనున్నాయి.