కొల్లాపూర్, నవంబర్ 22: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు. మండలంలోని సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్వాటర్ కృష్ణానదిలో ప్రభుత్వం నుంచి ఉచితంగా మంజూరైన 10లక్షల చేపపిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీరం మంగళవారం నదిలో వదిలారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బీరం మీడియాతో మాట్లాడారు.
మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతున్నట్లు ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. చేపలను దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వమే మత్స్యకారులకు వాహనాలు, ఐస్ బాక్సులను ఉచితంగా అందించి మార్కెట్లో విక్రయించే వెసులుబాటును కల్పించిందన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, ఎంపీపీ భోజ్యానాయక్, మాజీ జెడ్పీటీసీ జంబులయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, కౌన్సిలర్ కృష్ణమూర్తి, మాజీ సర్పంచులు రంగస్వామి, వెంకటస్వామి, నాయకులు రవి, మండల కోఆప్సన్ సభ్యుడు హరున్పాషా, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి పాల్గొన్నారు.