వనపర్తి టౌన్, నవంబర్ 13: వనపర్తి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా విరజిల్లుతున్నాయి. తరగతి గది బోధనతోనే సర్వవిజ్ఞానం విద్యార్థులు పొందలేరు. పుస్తక పఠనం అనుబంధ గ్రంథాలతో కుస్తీపట్టి విజ్ఞానాన్ని పొంది మరింతగా అనుభవాలను గడించినప్పుడే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అందులోభాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం నింపనున్నారు.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
సోమవారం జ్యోతి ప్రజ్వలనతో వారోత్సవాలు ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు హర్షవర్ధ్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వారావు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై వేడుకలను ప్రారంభించనున్నారు.