పాలమూరు, ఫిబ్రవరి 23 : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయాన్ని కేసీఆర్ సర్కారు హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మరిన్ని వసతుల కోసం గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని శ్రీనివాస్గౌడ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్ర్తాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బస చేసేందుకు రూ.2కోట్ల 50లక్షలతో 18 ప్రత్యేక గదలను నిర్మించినట్లు తెలిపారు. తాగునీరు, కొండపైకి వెళ్లేందుకు నాలుగు లేన్ల రహదారితోపాటు సెంట్రల్ లైటింగ్, రూ.15కోట్లతో హోటల్, పేదింటి ఆడపిల్లలకు పెండ్లి చేసేందుకు రూ.50లక్షలతో హాల్ నిర్మాణం చేపట్టామన్నారు.
అలాగే రూ.2కోట్లతో అత్యాధునిక వసతులతో కల్యాణ మండపం కోసం గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించామని, తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే కోసం తన హయాంలో శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు లేకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, మన్యంకొండ ఆలయ చైర్మన్ మధుసూదన్కుమార్, సీనియర్ నాయకులు రాజేశ్వర్, దేవేందర్రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్గౌడ్, రాఘవేందర్గౌడ్, నర్సింహారెడ్డి, వెంకట్స్వామి, నవకాంత్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.