జోగులాంబ గద్వాల : జిల్లాలో మూడు నెలలుగా కలవరపెడుతున్న చిరుత సంచారం సీసీ ఫుటేజ్లో జాడ తెలిసింది . జిల్లాలోని మల్దకల్ మండలంలో చిరుత ( Leopard ) సంచరిస్తున్నట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. మండలంలోని పలు గ్రామాల్లో మూగ జీవాలపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపేస్తుంది. దీనిపై ఆందోళన చెందిన రైతులు జిల్లా అటవీశాఖ అధికారులకు ( Forest Officials ) సమాచారం అందించారు.
తాజాగా నేతువానిపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానించడంతో
చిరుత కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు గురువారం నేతువానిపల్లి అటవీ ప్రదేశంలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చనిపోయిన ఓ మూగ జీవిని అటవీలో వేసి సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించారు. మూగజీవిని చిరుత పులి దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇప్పటి వరకు గ్రామ శివారులో 8 జంతువులు చిరుత దాడిలో మృతి చెందాయి.
చిరుతను బందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. శుక్రవారం అటవీప్రాంతంలో అధికారులు పర్యటించి మరో సారి చిరుత కదలికలపై నిఘా పెట్టారు.