జడ్చర్లటౌన్, అక్టోబర్ 6 : జడ్చర్ల మండలంలోని పలు గ్రామాల్లో రూ.కోట్లాది నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అలాగే పలు గ్రామాల్లో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు గావించారు. పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదటగా మండలంలోని ఎక్వాయ్పల్లిలో రూ.1.37కోట్లతో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ఆపార్ట్మెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఎక్వాయ్పల్లి గ్రామ శివారులోని వాగుపై బ్రిడ్జి మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పెద్దఆదిరాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఆదిరాల, నేలబండతండా, చిన్న ఆదిరాల, కొల్లొన్మర్రితండా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
అనంతరం కోడ్గల్ గ్రామంలో కలెక్టర్ రవినాయక్తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ అల్ఫాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. కోడ్గల్ గ్రామ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కొండేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవన్ను ప్రారంభోత్సవం చేశారు. గ్రామ యువకులకు స్పోర్ట్స్కిట్లను అందజేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. గొల్లపల్లిలో పలు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామ యువకులకు స్పోర్ట్స్ కిట్లను, తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన దసరా పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ప్రజలు, నాయకులు సత్కరించారు.
జడ్చర్లలో తాసీల్దార్ కార్యాలయం,భూసారపరీక్షా కేంద్రం భవనాలు ప్రారంభం
జడ్చర్లలో నూతనంగా నిర్మించిన తాసీల్దార్ కార్యాలయం, భూసార పరీక్షా కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అలాగే తాసీల్దార్ శ్రీనివాసులు, భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ ఆంజనేయులును వారి వారి సీట్లపై కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. తాసీల్దార్ శ్రీనివాసులు కార్యాలయంలో సీటుపై కూర్చొని ఫైలుపై మొదటి సంతకం చేశారు. అనంతరం మేస్త్రీ సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోహన్రావు, సింగిల్విండో అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలాభివృద్ధి..
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలాభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఇప్పటూర్, చెన్నారెడ్డిపల్లి, రుక్కంపల్లి, యన్మన్గండ్ల, నవాబ్పేట, లోకిరేవు, ఊరంచుతండా, కిషన్గూడ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.