మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 2 : పాలమూరులో డ్రోన్ షో అదిరింది. మినీ ట్యాంక్బండ్ వద్ద సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన లేజర్ లైటింగ్ షో కనువిందు చేసింది. స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడం తో చెరువు గట్టు కిక్కిరిసిపోయింది. ప్రజల కోలాహలం.. యువత కేరింతల మధ్య వేడుక ఆద్యంతం అట్టహాసంగా సాగింది. డ్రోన్షోలో భాగంగా మహా త్మా గాంధీ, రాట్నం, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్, అమరవీరుల స్తూపం.. వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. తీగల వంతెనను ఎంపీ సంతోశ్తో కలిసి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. వంతెనపై నుంచి అందాలను తిలకించి బోటులో పెద్ద చెరువులో విహరించారు. గతంలో దుర్గంధభరితంగా ఉన్న ప్రాంతం నేడు మినీ శిల్పారామం.. ఐలాండ్.. సస్పెన్షన్ బ్రిడ్జితో పర్యాటక కేంద్రంగా మారడంతో సందర్శకుల తాకిడి మొదలైంది.
ట్యాంక్బండ్ వద్ద నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిని ఎంపీ సంతోష్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ బోట్లో ప్రయాణించి ప్రారంభించారు. అనంతరం డ్రోన్, లేజర్ షోను ప్రారంభించి ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కేరింతలు కొడుతూ షోను ఎంజాయ్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ట్యాంక్బండ్ ప్రాంతమంతా ముళ్లపొదలతో ఉండేదని, రామయ్యబౌళి ప్రాంతానికి రావాలంటే భయపడేవాళ్లమన్నారు. నేడు ఇతర రాష్ర్టాల వారు సైతం తిలకించేలా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. విదేశీ పర్యాటకులు సైతం సందర్శించేలా 26వేల ఎకరాల్లో జంగల్ సఫారీని సిద్ధం చేసి రెండు సఫారీ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. బర్డ్స్ ఎన్క్లోజర్ ద్వారా వేలాది పక్షులను ఒకేచోట తిలకించే వీలు కల్పిస్తున్నామని
తెలిపారు.