మహబూబ్నగర్, నవంబర్ 30: జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనులకు చేపట్టిన భూ సేకరణ తుది దశకు తీసుకురావాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా భూ సేకరణపై ఇంజినీరింగ్, తాసిల్దార్లతో సమీక్షించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రావిటీ కెనాల్ ప్రధాన ఎడమ కాలువ తదితర భూ సేకరణ పనులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆర్వోఎఫ్ఆర్ కింద పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజినీర్లు, తాసిల్దార్లు పాల్గొన్నారు.
2మద్యం షాపులకు లక్కీడిప్
తక్కువ టెండర్లు నమోదైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెండింగ్లో పెట్టిన రెండు వైన్ షాపుల లక్కీడిప్ ప్రక్రియ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు సమక్షంలో నిర్వహించారు. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలానికి చెందిన 67,68 షాపులకు దరఖాస్తులు తక్కువ రావడంతో లక్కీ డ్రా నిలిపివేసిన విషయం విధితమే. అయితే మంగళవారం నిర్వహించి డ్రాలో లక్కీ నెంబర్ 3కు చెందిన వ్యకిత మురళీధర్గౌడ్ షాప్ను దక్కించుకున్నారు. కాగా మొత్తం 30 దరఖాస్తులు వచ్చాయి. షాప్ నెంబర్ 68కు సంబంధించి 27 దరఖాస్తులు రాగా లక్కీ నెంబర్ 10 పొందిన వ్యక్తి శ్రీనివాసులు టెండర్ సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పనులను పూర్తి చేయండి
నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం తుదిదశ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో నూతన కలెక్టరేట్ పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ పనులు, ఆడియో, విజువల్ పనులు, ఆర్చ్, స్టేట్బోర్డు రూం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హెలీప్యాడ్ పనులపై లేఖరాయాలని సూచించారు. అనంతరం పట్టణ రోడ్డు పనులపై సమీక్షించారు. దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్పవర్, సీతారామారావు, అర్అండ్బీ, ఎస్ఈ నర్సింగ్, మూర్తి, స్వామి, రాజేందర్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో పద్మశ్రీ పాల్గొన్నారు.