అలంపూర్, మార్చి 5 : కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన విరామం ఉంటుందని పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, అర్చకుడు ఆనంద్శర్మ తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో యథావిధిగా పూజలు చేసుకోవచ్చన్నారు. గద్వాల ఆర్డీవో రాంచందర్ అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్డీవో రాంచందర్ అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ మంజుల, ఆలయ ఈవో పురేందర్కుమార్ ఉన్నారు.