అయిజ, జూన్ 15 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట శిథిలావస్థకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ నియోజకవర్గంలో 87, 500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిజాం పాలకులు 1946 ఆర్డీఎస్ ఆనకట్ట పనులకు శ్రీకారం చుట్టి 1958లో పనులు పూర్తి చేసింది. 143కిలోమీటర్ల పొడవు ప్రధానకాల్వ ద్వారా గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించేందుకు ఆర్డీఎస్ ఆనకట్టను నిర్మించా రు. కర్ణాటక, ఏపీతోపాటు తెలంగాణలోని అ లంపూర్ నియోజకవర్గంలోని 82 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను ఉమ్మడి ఏపీ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆనకట్ట ప్రమాదపుటంచున ఉన్నది.
ఆధునీకరణ పనులలో భాగంగా ప్యాకేజీ 1 పనులు గత సమైక్య పాలనలో పెం డింగ్లో ఉండటంతో కేసీఆర్ హయాంలోని ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 2017లో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్యాకేజీ -1కు రూ.3.30 కోట్లు విడుదల చేసింది. ఆనకట్ట పటిష్ట పర్చడం, బకెట్ల ఏర్పాటుతోపాటు ఆనకట్టను 6 ఇంచుల మేర ఎత్తు పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమైఖ్య పాలకులు ఆర్డీఎస్ను ఆగం చేశారే తప్పా పనులు పూర్తి చేయించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మూడు రాష్ర్టాల పరిధిలోకి ఆర్డీఎస్ ప్రాజెక్టు వెల్లడంతో పనులు దీర్ఘ కాలంగా పెండింగ్లోనే ఉండిపోయాయి. గుత్తేదారు 160మీటర్లు వరకు ఎత్తు పెంచే పనులు చేపడుతుండగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా రైతులు, అధికారులు పనులు చేపట్టేందు కు వీలులేదంటూ పనులకు అడ్డుతగిలారు. దీంతో పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. 840 మీటర్లు 6 ఇంచుల మేర ఎత్తు పెంచాల్సి ఉండగా, కేవలం 160మీటర్లు మాత్రమే పూర్తి చేసి గుత్తేదారు చేతులు దులుపుకొన్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టాలని గుత్తేదారును కర్ణాటక, తెలంగాణ అధికారులు ఒత్తిడి తెచ్చినా పనులు చేయకుండా మిన్నకుండిపోయారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ ఆనకట్ట ద్వారా సాగునీరు పుష్కలంగా అందించడంతోపాటు ఆయకట్టుకు ప్రత్యామ్నాయంగా 2018 లోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 55 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరెండ్లు పూర్తయిన ఆర్డీఎస్ ఆనకట్టకు నిధులు కేటాయించకపోవడంతో ఆనకట్ట, ప్రధానకాల్వ, డిస్ట్రిబ్యూటరీలు మరమ్మతులకు నోచుకోలేదు. ఆర్డీఎస్ ఆనకట్టకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతాంగం ఇంజినీర్లు, నిపుణులు, ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేఆర్ఎంబీ ఇంజినీర్లు ఆర్డీఎస్ ఆనకట్టకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేసీఆర్ఎంబీ) ఇంజినీర్ల బృందం మంగళవారం కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించనున్నది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్ట పరిస్థితి, నీటి లభ్యత, పూడిక, స్కవర్ స్లూయిస్, హెడ్వర్స్ గేట్ల నాణ్యత, ప్రధానకాల్వ పరిస్థితి, పెండింగ్లో ఉన్న ఆధునీకరణ పనులు వంటి అంశాలపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఇంజినీర్లతో సమీక్ష చేయనున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టకు భారీ వరదలొస్తే కట్ట ప్రమాదంలో పడే అవకాశాలు మెం డుగా ఉన్నాయని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేఆర్ఎంబీ ఇంజినీర్ల పరిశీలనతో ఆర్డీఎస్ ఆధునీకరణకు మోక్షం లభిస్తుందని ఆర్డీఎస్ రైతాంగం ఆశిస్తోంది.