కోయిలకొండ, జూలై 29 : కోయిలకొండ బీ ఫాతిమా మొహర్రం ఉత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా గ్రామంలోని ఫీర్ల చావిడీల్లో కొలువైన పీర్లకు నిర్వహించిన ఊరేగింపు ఘట్టం ఆకట్టుకున్నది. శనివారం తెల్లవారుజామున అమ్మకు ప్రభుత్వం నుంచి సర్కార్ శక్కరను తాసీల్దార్ మురళి, సర్పంచ్ కృష్ణయ్య అందజేయగా బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీ ఫాతిమా పీరును ఖిల్లా నుంచి ఊరేగించారు. కాగా బీ ఫాతిమా పీరు సమక్షంలో అగ్నిగుండాన్ని భక్తుడు ఖాజా నిర్వహించగా వేలాదిగా తరలొచ్చారు. సాయత్రం బీబీ ఫాతిమా పీరుతోపాటు డాల్సాబ్, గండెల్సాబ్, మొగులాలి, ఇమాం ఖాసీం, ఉషన్పాషా, చాన్దూలాతోపాటు వివిధ పీర్లు నిమజ్జనానికి తరలడంతో వేడుక ముగిసింది.
మొహర్రంలో భాగంగా ఊరేగింపునకు తరలిన పీర్ల సవార్లు ఆకట్టుకొన్నాయి. యుద్ధంలో బీబీ ఫాతిమా భర్త మొగులాలి మృతి చెందిన విషయాన్ని డాల్సాబ్ చెప్పేందుకు రాగా తన భర్త మరణవార్త చెవులతో వినకూడదని తప్పించుకొని వెళ్లే సందర్భం ఆకట్టుకున్నది. అదేవిధంగా కోయిలకొండ, పారుపల్లి, ఇబ్రహీంనగర్, కొత్తపల్లి గ్రామాలకు చెందిన పీర్లు బీబీ ఫాతిమా పీరును దర్శించుకునేందుకు వచ్చిన ఘట్టం ఆకట్టుకున్నది. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హన్వాడ ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.