గద్వాల/గద్వాల రూరల్/మల్దకల్/కేటీదొడ్డి, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి, గద్వాల మండలంతోని గోన్పాడుతోపాటు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్తో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్దకల్ మండలం దాసరిపల్లిలో వెలసిన గ్రామ దేవత సవారమ్మ అవ్వను, కేటీదొడ్డి మండలం పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆర్ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. ప్రజలకోసం పరితపించే నాయకుడిని ఎంపీగా గెలిపించుకొని నడిగడ్డను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు తలెత్తాయన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా రైతుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో రైతుబంధు, రుణమాఫీ, నిరంతరం కరెంట్ ఇచ్చేదన్నారు. ఈ సర్కారు రైతులను గాలికొదిలేసిందని, ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని కాపాడుకున్న పంటను కూడా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్కు చేరికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. అందుకే ప్రజలందరూ కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి.. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా గద్వాల మండలం గోనుపాడులో ఎమ్మెల్యేతోపాటు ఆర్ఎస్పీని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో, మార్కెట్ యార్డులో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. పోస్టాఫీస్ వద్ద దౌలత్ టీస్టాల్లో టీ చేసి ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ అధ్యక్షుడు రామన్గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, రాజశేఖర్, ఎంపీపీ మనోరమ, సింగిల్విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, కేటీదొడ్డి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉరుకుందు, సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్రెడ్డి, సత్యారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, శ్రీధర్గౌడ్, మధుసూదన్రెడ్డి, తూం కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, భరత్, పెద్దపల్లి అజయ్, చంద్రశేఖర్రెడ్డి, నరేందర్, పరశురాముడు, మధుతోపాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంతియాజ్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.