మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 2 : కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. మహబూబ్నగర్లోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో రూ.2.70కోట్లతో నిర్మించనున్న బర్డ్స్ ఎన్క్లోజర్ను ఎంపీ, మంత్రితో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం 26వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద జంగల్ సఫారీతోపాటు రెండు సఫారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి ఆ వాహనంలోనే వాచ్టవర్ వరకు వెళ్లి అటవీ ప్రాంతాన్ని తిలకించారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్ చేతుల మీదుగా జంగల్ సఫారీని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. తాగు, సాగునీరు, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీ టవర్ ఇలా ఎన్నో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వందేండ్ల పాలనలో ఆకలి చావులు, బాధలు, కనీసం తాగడానికి మంచీనీరు కూడా లేక ఎన్నో అవస్థలు పడ్డామన్నారు. వంద ఏండ్లుగా ఉన్న ఈ పార్కు అభివృద్ధికి ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. భవిష్యత్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేలా జంగల్ సఫారీని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఎంపీ సంతోష్ మాట్లాడుతూ 1.5 ఎకరాల్లో వేలాది పక్షులతో బర్డ్స్ ఎన్క్లోజర్ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. పక్షుల ప్రేమికుడైన తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ప్లాస్టిక్ ఫ్రీ పార్కుగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, డీఎఫ్వో సత్యనారాయణ, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.