మహబూబ్ నగర్ : కర్ణాటక ( Karnataka ) ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల ( Illegal Projects ) వల్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Former Minister Srinivas Goud) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్పై కృష్ణ పరివాహక ప్రాంతంలో ఆయా ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తాము మాట్లాడుతున్నది అవాస్తవం కాదని అన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు హెలికాప్టర్లో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్రమా ప్రాజెక్టులు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్కు వంద మీటర్ల దూరంలోనే కర్ణాటక ప్రభుత్వం లిఫ్ట్ పనులు మొదలు పెట్టిందని, వీటితోపాటు మరో రెండు రోడ్ కమ్ బ్యారేజులు కడుతుందని ఆరోపించారు. చంద్రబాబు గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల రిజర్వాయర్కు ప్రణాళిక తయారు చేశారని వెల్లడించారు. వీటి వల్ల తుంగభద్ర నీరు శ్రీశైలంకు శాశ్వతంగా రావని వివరించారు.
కృష్ణా పైకూడా అనేక ప్రాజెక్టులు కడుతున్నారని, ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే జరుగుతున్నాయని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు పూర్తయితే పాలమూరు లో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఒక్క చుక్క నీరు రాదని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా అక్రమ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి చూడాలని కోరారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టు పనులు నిలిపివేస్తామని అన్నారు.