‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్టాం.. వాటిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు కావడంలేదు. మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.. గత ప్రభుత్వాలు 12 గంటల విద్యుత్ ఇస్తే.. స్కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. పంటలు ఎండిపోతున్నా.. రైతులు మరణిస్తున్నా కన్నడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా బాధలు వర్ణణాతీతం. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసున్నారు. ఇలాంటి ఒక్క పథకం కూడా మా వద్ద లేదు.’ అంటూ గుండెల్లోని బాధను వ్యక్తపరుస్తూ కర్ణాటక రాష్ట్రం రాయిచూర్కు చెందిన రైతులు మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు.
గద్వాల, అక్టోబర్ 24 : కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు తప్పవని.. నమ్మి మోసపోతే గోసపడుతామని కర్ణాటకలో ఓటేసి గెలిపించిన ప్రజలే నేడు ఆ పార్టీ తీరుపై ఛీకొడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఆర్టీసీలో మహిళలకు ఉచితం ప్రయాణ సౌకర్యం కల్పించగా, పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతులతోపాటు ప్రజలు ఉరేసుకోవాల్సి వస్తుంది.. కాంగ్రెస్ను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేయవద్దని సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాయిచూర్కు చెందిన రైతులు మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబస్స్టాండ్ ఆవరణలో రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదన్నారు. గతంలో రైతులకు 12గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3గంటల కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. దీంతో వరి పైరు ఎండిపోతుందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రైతులకు రూ5వేలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీలు ఇవ్వలేక ప్రభుత్వం చతికిలపడిపోయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆరు హామీల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారు చెప్పే ఆరు హామీలు ఆరు రోజులు కూడా అమలు కావన్నారు. కర్ణాటకలో పంటలు ఎండిపోయి రైతులు చనిపోతున్నా ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నాడని చెప్పారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో ఇక్కడి రైతులు సిరులు పండిస్తున్నారని, దీంతోపాటు రైతు మరణిస్తే వారికి బీమా కింద రూ.5లక్షలు ఇస్తున్నారన్నారు. ఇలాంటి పథకాలు మాకు కావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఓటు వేయవద్దని కోరుతూ తెలంగాణ మొత్తం ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ చీకట్లో మగ్గుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చే మోసపూరిత వాగ్ధానాలు నమ్మి మోపసోవద్దని, మేము నమ్మి ప్రస్తుతం గోసపడుతున్నామని చెప్పారు. ఈ ఆందోళనలో రైతులు నగేశ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల కోసం తెలంగాణలో అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు, సాగుకోసం 24గంటల ఉచిత విద్యుత్ పథకాలు కర్ణాటకలో అమలు చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఆశపడి ఓటు వేసి ఇప్పుడు గోసపడుతున్నాం. తెలంగాణ ప్రజలు మోసపోకూడదనే ముందస్తుగా కాంగ్రెస్ మోసాలను తెలియజేయడానికి ఈ ఆందోళనలు చేపడుతున్నాం. కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు తప్పవు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తీర్చడంతోపాటు రైతులకు మేలు చేకూర్చే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మి గెలిపించాం. అధికారంలోకి వచ్చాక చెప్పిన ఏ ఒక్క హామీ పట్టించుకోవడం లేదు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యమని చెప్పి అదీ సరిగా అమలు కావడం లేదు. మాలాగా తెలంగాణ రైతులు మోసపోకుండా ఉండాలనే ఈ ఆందోళనలు చేస్తున్నాం. కాంగ్రెస్ మాటలు నమ్మితే రైతులు ఉరేసుకోవాల్సి వస్తుంది.