లింగాల, ఫిబ్రవరి 16: కనిపెంచిన కూతురును కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కొత్తకుంటపల్లికి చెందిన తగిలి తిరుపతయ్య, మహేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కూతురు జాను(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది. తండ్రి తిరుపతయ్య నాగర్కర్నూల్లో ఉంటూ డెకరేషన్, సౌండ్ సిస్టమ్ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహేశ్వరి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ స్వగ్రామంలోనే ఉంటున్నది. ఈ క్రమంలోనే అనుమానాస్పద స్థితి లో బాలిక జాను మృతిచెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాప మృతిపై బంధువులకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన వారు అంత్యక్రియలను నిలిపివేయించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం రాత్రి గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై మద్యం తాగి, మైకంలో కొట్టి చంపిందని ఆరోపించారు.
ఈ మేరకు అచ్చంపేట సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై జగన్మోహన్ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. బంధువుల అనుమానం నేపథ్యంలో బాలిక తల్లి మహేశ్వరిని అచ్చంపేటకు తీసుకెళ్లి విచారణ చేయడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తానే చంపినట్లు ఒప్పుకున్నది. అంతకుముందు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అచ్చంపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ, ఎస్సైలు వెల్లడించారు.