జడ్చర్లటౌన్, మే 29 : జీవవైవిద్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జీవవైవిద్య మండలి ప్రధానకార్యదర్శి కాళీచరణ్ కథర్డే అన్నారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బొటానికల్ గార్డెన్లో మొక్క నాటి నీళ్లు పోశారు. గార్డెన్లో పెంచుతున్న మొక్కల వివరాలను సమన్వయకర్త సదాశివయ్యతో తెలుసుకున్నారు. బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన వర్క్షాపులో పాల్గొని మాట్లాడారు.
జీవవైవిద్యాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణలో అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ కోసం జీవవైవిద్య మండలితో జడ్చర్ల డిగ్రీ కళాశాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అంతకుముందు రీజినల్ కోఆర్డినేటర్ శిల్పిశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అంతరించిపోతున్న మొక్కలను సంరక్షించేందుకు తెలంగాణ బొటానికల్ గార్డెన్ అనువుగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర అధ్యాపకులు శ్రీనివాసులు, పరిశోధక విద్యార్థులు రమాదేవి, రాహుల్, వీరాంజనేయులు, రాష్ట్ర జీవవైవిద్య మండలి టెక్నికల్ అసిస్టెంట్ గోపి పాల్గొన్నారు.