నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు.. జాతికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలు జరుపుకొనే పండుగనే ఏరువాక పౌర్ణమి.. ఎంతో ప్రాముఖ్యత.. ప్రత్యేకతలు ఉన్న ఈ వేడుకను ఘనంగా జరుపుకొనేందుకు పల్లెలు సిద్ధమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలని పిండి వంటలతో దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించనున్నారు. పాడిపశువులను అందంగా ముస్తాబు చేసి సంబురాలు చేసుకోనున్నారు. మంగళవారం మార్కెట్లో రైతుల పండుగకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు.
– గద్వాల టౌన్, జూన్ 10
వ్యవసాయదారులు(రైతులు) ఏరువాక పండుగను జేష్ఠ్య పౌర్ణమి రోజు జరుపుకొంటారు. తెలుగు సంవత్సరంలో జేష్ఠ్యమాసం మూడో నెల. ఈ నెల మొదటి పక్షంలో రోహిణికార్తె తరువాత మృగశిర కార్తె వస్తుంది. ఈ కార్తెలో ఎండల ప్రభావం తగ్గి ముంగిళ్లు చల్లబడతాయన్న నానుడి ఉన్నది. అంతేకాదు జ్యేష్ఠపౌర్ణమి నా టికి తొలకరి పలుకరించక మానదు. ఇందుకు కృతజ్ఞత పూర్వకంగా జరుపుకొనే పండుగను కృషి పూర్ణిమ, మాల పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అంటారు.. ఏరువాక అంటే నాగలితో దుక్కి వ్యవసాయ పనులు ప్రారంభించడమ న్న అర్థం ఉన్నది. ఆరుగాలం రైతులకు అన్ని విధాలా అండగా ఉండి పంట పొలాల్లో తమతోపాటు శ్రమించే పశువులను ఏరువాక నాడు పూజిస్తే కాలం కలిసొస్తుందని ఓ నమ్మకం అందుకే రైతులు ఏరువాకను ఓ సంప్రదాయ పండుగగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నది.
జ్యేష్ఠ పూర్ణిమ విశిష్టత..
నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. ఈ నక్షత్రం చంద్రుడు కూడి ఉండే రోజు కావడం ఎంతో విశేషం. చంద్రుడు ఓషదులకు అధిపతి. ఓషదులు అనగ మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు అని అర్థం. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం ఫలసాయాన్ని ఇస్తుందన్న నమ్మకం రైతుల్లో ఉన్నది. అందుకే రైతులు జ్యేష్ఠ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
పండుగ జరుపుకొనే విధానం
ఆరుగాలం కష్టించే రైతన్నలకు తోడుగా వారి కష్టాల్లో భాగం పంచుకుంటూ అన్ని విధాలా అండగా ఉండే ప శువులకు ఏరువాక పౌర్ణమి రోజు గ్రామాల్లో ఉదయాన్నే చెరువులు, కుంటల వద్దకు తమ ఎద్దులను తీసుకెళ్లి స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంట లు, కుచ్చులు కట్టి శరీరం నిండా రంగులు అద్దుతారు. ఆర్థిక స్థోమత ఉన్న రైతులకు ఎద్దులను నూతన వస్ర్తాలతో అలంకరించి ఇంట్లో ఉన్న గాటి వద్దకు తీసుకొస్తారు.
పండుగ సందర్భంగా చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ గాటికి దూప, దీపాలతో పూజలు చేసి చల్లంగా చూడమని వేడుకుంటారు. సాయంకాలం మంగళవాయిద్యాలతో ఊళ్లో ఉన్న పశువులన్నింటినీ ఒక దగ్గరకు చేరుస్తారు. అక్కడి నుంచి పశువుల ఊరేగింపు ప్రజల కేరింతల మధ్య కన్నుల పండువగా సాగుతుంది. ఎద్దులతోపాటు నాగలిని ఎర్రమట్టి, సున్నం పట్టెలతో అలంకరించి పొలం వద్దకు వెళ్తారు. ఈ ఏడాది రైతు కుటుంబంలో ఎవరి పేరుపైన బలం ఉందో వారు దుక్కిని దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు.
ఏరువాక తాడు తెంచడం..
దుక్కి దున్నడానికి వెళ్లే ముందు ఊరి పొలిమెరలో పుంటి నారతో తోరణాన్ని కడతారు. ఆ తోరణానికి రూపాయలు, జిలేబీలు, గారెలు, గజ్జెలు తదితర వస్తువులను కట్టి అలంకరిస్తారు. వాటిని రైతులు చెర్నకోలతో కొడుతూ ఎవరికి దొరికిన వస్తువును వారు తీసుకెళ్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతుల నమ్మకం. దీనినే ఏరువాక తాడు తెంచడం అని అంటారు. ఈ ఆచారాన్ని, పండుగను విష్ణు పురాణంలో సీత యజ్ఞంగా పిలువబడేదని ప్రతీతి.
పండుగకు సర్వం సన్నద్ధం
ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించేందుకు నడిగడ్డ ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. దీంతో మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు గ్రామాలు ప్రజ లు, రైతులతో కళకళాలాడుతూ కనిపించాయి. ఉత్సవాలకు సంబంధించిన వాటిని కొనుగోళ్లు చేయడంలో నిమగ్నం అయ్యారు. గ్రామ దేవతలకు సమర్పించేందుకు సంత రోజు కాకపోయిన కోళ్ల కొనుగోళ్లు కూడా జోరుగా సాగింది. అలాగే గ్రామ దేవతలైన సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు. స్థానిక చింతలపేటలో ఏరువాక తాడు తెంచే ఉత్సవాన్ని నిర్వహించేందుకు, ఎద్దుల ఊరేగింపు కావాల్సిన ఏర్పాట్లను నిర్వాహకులు దగ్గరుంచి చూస్తున్నారు.
నాటుకోళ్లకు యమ డిమాండ్
అలంపూర్ చౌరస్తా, జూన్ 10 : ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నాటుకోళ్ల గిరాకీ డిమాండ్ బాగా పెరిగింది. మటన్కు దీటుగా నాటుకోళ్లు కిలో రూ. వెయ్యి నుంచి 1200 పలకడంతో ప్రజలు ఏం చేయాల్లో తెలియక అయోమయానికి గురవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఏరువాక పున్నమికి సుంకులమ్మ అమ్మవారికి గుడి ఎదుట నాటు కోళ్లను బలిచ్చే ఆనవాయితీ ఉండడంతో ప్రజలు కర్నూల్, రాయిచూర్ పరిసర ప్రాంతాల నుంచి, గ్రామాల్లో ఇండ్ల వద్ద పెంచుకుంటున్న నాటుకోళ్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో నాటుకోళ్లు అమ్మేవారు ధరలను అమాంతం పెంచడంతో ప్రజలు గత్యంతరం లేక రూ.వేలు పెట్టి నాటుకోళ్లన్లు కొనుగోలు చేస్తున్నారు.