మహబూబ్నగర్ టౌన్/వనపర్తి టౌన్, జూన్ 28 : త్యాగ నిరతికి, భక్తిభవానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్. ఇస్లామిక్ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్హిజ్జా నెలలో పదో రోజున పండుగ కాగా, తొమ్మిదో రోజునే ఆరాఫా దినంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగిశాక రెండు నెలల తర్వాత వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. మనిషి అమితంగా ప్రేమించే ధనం, ఇష్టపడే ఆహార పదార్థాలు, వస్తువులను దానం చేయడం అనాదిగా వస్తున్నది. పండుగకు ఉమ్మడి మహబూబ్నగర్ ముస్తాబైంది. మసీదులన్నీ విద్యుద్దీపాల అలంకరణతో కాంతులీనుతున్నాయి. సామూహిక ప్రార్థన కోసం ఈద్గాలను సిద్ధం చేశారు. పండుగను భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని ము స్లిం మతపెద్దలు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈద్-ఉల్ ఆదా సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం సంప్రదాయం కావడంతో చాలామంది బుధవారం జీవాలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ నమాజ్..
జిల్లా కేంద్రంలోని వానగుట్టలో ఉన్న రహెమానియ ఈద్గాలో ఈద్నమాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రహెమానియా ఈద్గాలో గురువారం ఉదయం 9గంటలకు హఫీజ్ ఇస్మాయిల్ ఖాద్రీ ఆధ్వర్యంలో ఈద్ ప్రత్యేక నమాజ్ చేస్తారు. పట్టణంలోని మక్కా మసీదు, మదీనా మసీదు, రైల్వేస్టేషన్ మజీదే ఓమర్, సిరాజుల్ ఉలుమ్ మసీదు, మజీదే షర్పీచమన్, షాషాబ్గుట్ట మసీదు, సూఫియా మసీదు, రియాజుల్జన్నా మసీదు, మనీర్ మసీదు, అల్కౌసర్తోపాటు మండలాలు, గ్రామాల్లో ఆయా మసీదులు, ఈద్గాల్లో నమాజ్కు ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలకు మున్సిపల్ అధికారులు సిద్ధం చేశారు.
పొట్టేళ్ల విక్రయాలు….
బక్రీద్ పండుగలో ఖుర్బానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తా రు. మూడు రోజుల పాటు పొట్టేళ్ల మాంసా న్ని పంపి ణీ చేస్తారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని న్యూటౌన్, పలు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు వెలిశాయి. పొట్టేళ్ల కేంద్రాలు ముస్లింలతో కిటకిటలాడుతున్నా యి. పొట్టేళ్ల బరువును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ధరలు ఉన్నాయి.