అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు వేళైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. 9వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉండడంతో ఆ రోజు పెద్ద ఎత్తున వేసేందుకు ఫిక్స్ అయ్యారు. అభ్యర్థుల జా తక బలం మేరకు తేదీలు, టైం మేరకు మంచి ఘడియలు చూసుకుంటున్నారు. మరికొందరు సెంటిమెంట్ ప్రకారం వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక్కొక్కరూ నాలుగైదు సెట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది. 10 వరకు స్వీకరించి.. 13న పరిశీలన చేసి, 15వ తేదీ వరకు ఉపసంహరణకు ఈసీ గ డువు విధించింది. 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అధికారులు గత ఎన్నికలకంటే ఎక్కువ పో లింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 517 పోలింగ్ కేంద్రాలు (107 సమస్యాత్మకం), నాగర్కర్నూల్లో 817 (276 సమస్యాత్మకం), వనపర్తిలో 541 (302 సమస్యాత్మకం), నారాయణపేటలో 553 (212 సమస్యాత్మకం), జోగుళాంబ గద్వాల జిల్లాలో 593 పోలింగ్ కేంద్రాలు (306 సమస్యాత్మకం) ఏర్పాటు చేశారు. ఇకపై అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసా , లెక్కా పత్రమంతా అధికారుల చేతుల్లోనే ఉండనున్నది.
మహబూబ్నగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టానికి తెరలేచింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది. ఈమేరకు ఎన్నికల సంఘం తరఫున ఆయా జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ షురూ కానున్నది. ఈనెల 10వ తేదీ వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 13 వరకు పరిశీలన ఉండనునండగా.. 15 వరకు ఆయా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. ఈనెల 30న పోలింగ్, వచ్చేనెల 3న ఓట్ల లెక్కంపు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 28,23,611 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 14,10,992 మంది పురుషులు, 14,12,562 మంది మహిళలు, ఇతరులు 57 మంది ఉన్నారు.
2024 జనవరి 16తో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనున్నది. అక్టోబర్ 9న ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసింది. ఆ వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చేసింది. ఎన్నికల నిబంధనలు అనుసరించి ఆయా జిల్లా కలెక్టర్లు పకడ్బందీ చర్యలు చేపట్టారు. బార్డర్ల వెంట చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమంగా మద్యం, డబ్బు రాకుండా కట్టిదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నలుగురు ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. మరికొందరు అధికారులపై చర్యలు తీసుకొని స్థాన చలనం చేశారు. షెడ్యుల్ ప్రకటించాక ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను షురూ కానున్నది. ఆయా నియోజకవర్గ కేంద్రాలకు కావాల్సిన ఈవీఎంలను తరలించారు. వాటిని స్ట్రాంగ్రూలలో అత్యంత భద్రత మధ్య ఉంచారు. ఈవీఎంలను ఎంపిక చేసిన రాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వారి సమక్షంలోనే సీల్వేసి భద్ర పర్చారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రక్రియపై అనేక దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండటంతో ఎన్నికల వేడిమరింత పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఇదివరకే పూర్తి చేశారు. నామినేషన్ ఘట్టం మొదలు నుంచి పోలింగ్ వరకు సంబంధిత అధికారులు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చేశారు. పోలింగ్కు సరిగ్గా 27 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ టికెట్లు కేటాయించి బీఫాం కూడా అందించింది. అన్ని పార్టీల కంటే ముందే పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలో మొత్తం 3,021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అధికారులు గత ఎన్నికలకంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల డిమాండ్ మేరకు పెట్టారు. మహబూబ్నగర్ జిల్లాలో 517, నాగర్కర్నూల్ జిల్లాలో 817, వనపర్తి జిల్లాలో 541, నారాయణపేట జిల్లాలో 553, జోగుళాంబ గద్వాల జిల్లాలో 593 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పొలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేయడానికి రంగం సిద్ధం చేశారు. కాగా ఆయా చోట్ల దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతోపాటు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నియమించారు. పోలింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో ఉంచనున్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 107, గద్వాల జిల్లాలో 306, నాగర్కర్నూల్ జిల్లాలో 276, వనపర్తిలో 302, నారాయణపేట జిల్లాలో 212 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు.
ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అయా పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ జాతక బలం మేరకు తేదీలు, టైం ప్రకారం నామినేషన్లు వేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. మరికొందరు అభ్యర్థులు సెంటిమెంట్ ప్రకారం వేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో 9న పెద్ద ఎత్తున నామినేషనుల వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అదే రోజు పార్టీ అధినేత కేసీఆర్ తన నామినేషన్ దాఖలు చేస్తుండటంతో చాలా మంది అభ్యర్థులు అదే తేదీని ఎంచుకున్నారు. నామినేషన్ వేశాక కొందరు అభ్యర్థులు నాలుగైదు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒక సెట్ వేస్తే అందులో తప్పులు దొర్లితే మరో సెట్తో నామినేషన్ వ్యాలుబుల్ అవుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా దాఖలు చేస్తారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకొని ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అబ్జర్వర్లకు ప్రతిపైసా లెక్క చూపాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఇక ప్రచార పర్వం ఊపందుకునే అవకాశం ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఆ మరుక్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుందని పాలమూరు జిల్లా కలెక్టర్ రవినాయక్ తెలిపారు. అన్ని నియెజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నామినేషన్ ఫారాలు, తప్పనిసరిగా ఇవ్వాల్సిన ధ్రువపత్రాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి నియమ, నిబంధనలు, హెల్ప్డెస్క్, ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణ, తదితర విషయాలన్నింటినీ సంబంధిత అధికారులు వివరించారు. నామినేషన్లు వేసే అభ్యర్థితోపాటు ప్రతిపాదించే అభ్యర్థులు, ఇతరుల కోసం అధికారులు ప్రత్యేకమైన టెంట్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్లను సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. నామినేషన్లకు సంబంధించి అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థితోపాటు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల ఘట్టానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. ఎన్నికల సంఘం సంబంధించిన ఫొటోగ్రాఫర్లను మాత్రమే అనుమతి ఉంటుందని ఆఫీసర్లు అంటున్నారు. నామినేషన్లు సమర్పించే అభ్యర్థులు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు అన్ని చెక్ చేసుకుని సమర్పించాలని కోరారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతుండటంతో ఎన్నికల వేడీ మరింత రాజుకుంటున్నది. అభ్యరులు నామినేషన్ సమర్పించేందుకు ముహుర్తాలు ఖరారు చేసుకుంటున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 2 : శాసనసభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో అధికార యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. నియోజకవర్గంలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1,21,960 పురుష ఓటర్లు, 1,21,960 మహిళా ఓటర్లు ఉన్నారు. 10మంది ఇతరులు కాగా, మొత్తం 2,43,331 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు 12,931 ఓటర్లు ఉండగా, 80ఏండ్లు పైబడిన వారు 6,821 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 107 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల నిర్వహణ ప్రశాంతమైన వాతావారణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో అనీల్కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 6 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకుగాను దరఖాస్తులు తీసుకువెళ్లారు.
జడ్చర్ల, నవంబర్ 2 : జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలకు సర్వసిద్ధం చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఓటింగ్, ఈవీఎం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 300మంది పీవోలు, 300మంది ఏపీవోలను కేటాయించారు. రిటర్నింగ్ అధికారి మోహన్రావు పర్యవేక్షిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,12,395మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,06922, మహిళా ఓటర్లు 1,05,649 మంది ఉన్నారు. నియోజకవర్గంలో జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, నవాబ్పేట, మిడ్జిల్, ఊర్కొండ మండలాలు ఉన్నాయి. వీటికి గానూ 274పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 274పోలింగ్ కేంద్రాలకు గానూ 29రూట్లను ఏర్పాటు చేశారు. వాటిని పర్యవేక్షించడానికి 29మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపచడానికి స్ట్రాంగ్రూంలను ఏర్పాటు చేశారు. 29న ఎన్నికల సిబ్బందికి ఇక్కడి నుంచే సామగ్రిని అందజేయనున్నారు.
మూసాపేట, నవంబర్ 2 : 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఎన్నికలకు మొత్తం 289 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్బన్ పోలింగ్ కేంద్రాలు 31, రూరల్ పోలింగ్ కేంద్రాలు 258 ఉన్నాయి. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 44 ఉండగా, సమస్యాత్మక పోలింగ్ కేద్రాలు 101 ఉన్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం మొత్తం 8మండలాల్లో కలిపి పురుషులు 1,13,258 ఓటర్లు ఉండగా, మహిళలు 1,14,556 ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,28,084 మంది ఓటర్లు ఉన్నారు.
మక్తల్, నవంబర్ 2 : నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 284 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించినట్లు తెలిపారు. మక్తల్ మండలంలో 74, మాగనూర్ మండలంలో 25, ఊట్కూర్లో 51, మదనాపూర్లో 4, మరికల్లో 9, కృష్ణలో 29, ఆత్మకూర్లో 35, అమరచింతలో 26, నర్వలో 31 కాగా, మొత్తం 284 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 2,38,586 ఓటర్లు ఉన్నారు. మహిళలు 1,21,900, పురుషులు 1,17,576 ఓటర్లు , ఇతరులు ఒకరు ఉన్నారు. ఎన్నికలకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు.
నారాయణపేట, నవంబర్ 2 : అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి 10 వరకు కొనసాగనున్న నామినేషన్ల పర్వాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే నామినేషన్ల సెంటర్కు వంద మీటర్ల వరకు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. ఇందుకోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 27వేల 367మంది ఓటర్లు ఉండగా, అందులో 1,12,697 మంది పురుష ఓటర్లు, 1,14,668 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందు కోసం మొత్తం 270 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 87 సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 28 రూట్లను ఏర్పాటు చేశారు. మొత్తం పది మంది అధికారులు, ఒక పోలీసు బృందం నామినేషన్ల కేంద్రం వద్ద విధులు నిర్వర్తించనున్నారు.