గద్వాల అర్బన్, డిసెంబర్ 16 : ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం ధరూర్ మండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్(17 ) జిల్లా కేంద్రంలో రూం అద్దెకు తీసుకొని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం కాలేజీకి వెళ్లి సాయంత్రం రూంకి వచ్చాడు. రూంలోనే ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడగా గమనించి స్నేహితులు వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూల్కు వెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని వెంటనే కర్నూల్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. వెంకటేశ్ మృతిపై విద్యార్థి సంఘ నాయకులు కాలేజీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాలేజీకి సరైన సమయంలో రావడం లేదని, సరిగ్గా చదవడం లేదని విద్యార్థిని దూషించి అవమానించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గద్వాల టౌన్ పోలీస్స్టేషన్లో విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని వివరణ కోరగా వెంకటేశ్ కాలేజీలో సరిగ్గా చదవడం లేదన్న విషయాన్ని తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లామని.. విద్యార్థిని అవమానించే విధంగా ఏమి చేయలేదని తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు కృషి చేస్తాం తప్పా వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు.