రైతన్న జీవితానికి సర్కార్ బీమా భరోసా కల్పిస్తున్నది. అన్నదాత సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం, పండిన పంటను దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఇలా కర్షకులకు ఎలాంటి కష్టం రానీయకుండా భరోసానిస్తున్నది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతుబీమా అమలుచేస్తూ వెలుగులు నింపుతున్నది. నామినీ ఖాతాలో పది రోజుల్లోనే రూ.5 లక్షలు జమ చేస్తున్నది. పట్టాదార్ పాస్పుస్తకం ఉన్న 59 ఏండ్ల లోపు రైతులకు ఈ పథకం వర్తిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు 2,467 మంది రైతు కుటుంబాలకు రూ.123.35 కోట్ల పరిహారం అందజే సింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్కు రైతన్నలు జేజేలు పలుకుతున్నారు.
గద్వాల, ఫిబ్రవరి 7 : రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. రైతులను రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పెట్టుబడిసాయం కింద వానకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇస్తూ అండగా నిలుస్తున్నారు. సాగుకు నిరంతర ఉచితవిద్యుత్ అందిస్తూ పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం చూస్తుంది. పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని విక్రయిస్తున్నది.
ఇలా రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూనే రైతుబీమా పథకం ద్వారా ఆర్థిక చేయూతనిస్తుండడంతో రైతు కుటుంబాలు ధీమాగా బతుకుతున్నారు. వ్యవసాయం చేసే రైతుకు సెంటు పొలం ఉన్న వారికి బీమా వర్తింపచేస్తుండడంతో సీఎం కేసీఆర్కు రైతులు జేజేలు కొడుతున్నారు. రైతులు దురదుష్టవశాత్తు, ప్రమాదంలో, సాధారణ మరణం పొందితే ఆ రైతుపై ఆధారపడ్డ కుటుంబం ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ కుటుంబం వ్యవసాయానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు రాకూడదనే మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకం అమలు చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపతున్నారు.
చనిపోయిన రైతును తిరిగి తీసుక రాలేకున్నా రైతుబీమా ద్వారా రూ.5లక్షలు నేరుగా రైతు కుటుంబంలోని నామినీ ఖాతాలో జమకావండతో ఆ కుటుంబానికి కొంత మేర ఆర్థిక చేయూతనిచ్చినట్లు అవుతుంది. రైతుబీమా పథకంలో భాగంగా ప్రభుత్వమే ప్రీమియం చెలిస్తుంది. రైతులు రూపాయి కట్టనవసరం లేదు. ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతతో రైతు కుంటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. నమస్తే తెలంగాణ గద్వాల మండలంలోని కుర్వపల్లి గ్రామాన్ని సందర్శించి రైతుబీమా పొందిన కుటుంబాలను కదిలించగా వారి చెప్పిన మాటలు.. గ్రామంలో మొత్తం ఏడు కుటుంబాలకు రైతుబీమా లబ్ధిదారులకు అందజేశారు.
2,467మంది కుటుంబాలకు లబ్ధి
రైతుబీమా పథకం 2018 ఆగస్టు 14న ప్రారంభమైనది. ఇప్పటి వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,467మంది రైతు కుటుంబాలకు రూ.123.35కోట్లు పరిహారం అందించారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో 1,264మంది రైతులకు రూ.63.20కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో 1203 మంది రైతు కుటుంబాలకు రూ.60.15కోట్లు అందించారు. జిల్లాలో రైతుబీమాకు 1,29,642మంది రైతులు దరఖాస్తు చేసుకోగా అర్హత కలిగిన రైతులు 1,09,943 మంది ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 59ఏండ్లలోపు రైతు కుటుంబాలకు మాత్రమే రైతుబీమా వర్తిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో రైతుకుటుంబాలు తిరిగి వ్యవసాయం వైపు నిలబడేలా రైతుబీమా అవకాశం కల్పించింది.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..
గతంలో ప్రభుత్వ పథకాలు అన్నీ మధ్యవర్తుల ప్రమేయంతో లబ్ధిదారులకు అందేవి. దీంట్లో ఎక్కువశాతం మధ్యవర్తులు తీసుకొని అసలైనా లబ్ధిదారులకు కొంతమేర అందేది. అయితే, సీఎం కేసీఆర్ రైతుబీమా పథకానికి సంబంధించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చనిపోయిన రైతు కుటుంబానికి సంబంధించి నామినీ ఖాతాలో డబ్బు జమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం అందించే పూర్తి సాయం రైతుల నామినీ ఖాతాలో జమవుతుంది. ఇలా పారదర్శకంగా రైతుబీమా ఖాతాలో జమవుతుంది.
బిడ్డ పెండ్లి చేశాను
మాది వ్యవసాయ కుటుంబం. మూడెకరాల పొలంలో కంది, మిరప సాగు చేశాం. అలాంటి సమయంలో ఇంటిపెద్ద దిక్కును కోల్పోయాం. ఇంట్లో చేతి కొచ్చిన బిడ్డను చూసి పెండ్లి ఎలా చేయాలనే ఆలోచనతో ది గాలుగా ఉండేదాన్ని. అలాంటి సమయంలో రైతుబీమా రూ.5 లక్షలు రావడంతో కొండంత ధైర్యం వచ్చింది. ప్రభుత్వం అందించిన సాయంతో బిడ్డకు ఘనంగా పెండ్లి చేశాను. మి గిలిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేసుకున్నా. కొంత డబ్బు నా బిడ్డ పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ప్రభుత్వం చేయూతనివ్వకుంటే ఇబ్బందులు పడే వాళ్లం.
– షాలీబీ, కుర్వపల్లి, గద్వాల
కొండంత అండగా నిలిచింది
మాకు రెండెకరాల పొలం ఉంది. అందులో మిరపతోపాటు మొక్కజొన్న సాగు చేశాం. వ్యవసాయం చేసుకుంటూ మంచిగా జీవిస్తున్న సమయంలో నా భర్త చనిపోయాడు. నాకు ముగ్గురు పిల్లలు. కుటుంబాన్ని ఎలా పోషించాలనుకునే సమయంలో ప్రభుత్వం రైతుబీమా ద్వారా రూ.5లక్షలు ఆర్థికసాయం అందించడంతో కొండంత అండగా నిలిచింది. బీమా డబ్బులతో ఇల్లు కట్టుకున్నా, అప్పులు తీర్చాను. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతు కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలి.
– పద్మమ్మ, కుర్వపల్లి, గద్వాల