వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.19.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.5.75 కోట్లతో టౌన్హాల్, రూ.1.50 కోట్లతో చేపట్టిన వైకుంఠధామం పనులు పూర్తి కాగా, త్వరలోనే ప్రారంభించనున్నారు. అలాగే జంతు జనన నియంత్రణ కేంద్రం, డంపింగ్ యార్డు వంటి పనులు సైతం పూర్తయ్యాయి. మంత్రి నిరంజన్రెడ్డి కృషి ఫలించింది. జిల్లా ప్రజలకు త్వరలోనే పలు భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
వనపర్తి, ఆగస్టు 6 : వనపర్తి జిల్లాగా అవతరించాక పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఈక్రమంలో పలు అభివృద్ధి పనులు పూర్తి కాగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాయాలు రాగా పట్టణ విస్తరణ పుంజుకున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరిన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులు, మంత్రి నిరంజన్రెడ్డి ఎప్పటికప్పుడు పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు.
రూ.19.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్..
జిల్లాకేంద్రం సమీపంలోని చిట్యాలలో అధునాతన తరహాలో అన్ని సౌకర్యాలతో నూతన మార్కెట్యార్డును నిర్మించారు. కాగా జిల్లాకేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఆ స్థలంలోనే పట్టణంలోని సగం జనాభాకు సరిపడా అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను రూ.19.5 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు 90 శాతం పూర్తి కాగా త్వరలోనే మొత్తం కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 85వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో ఈ మార్కెట్ను నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో వెజ్, నాన్వెజ్కు సంబంధించిన వ్యాపార సముదాయాలు, రెండో అంతస్తులో మరికొన్ని దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. రెండు అంతస్తులకు కలిపి 120 వ్యాపార దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, చిల్డ్రన్ పార్కు, 24 పండ్ల దుకాణాలు, మార్కెట్కు రెండువైపులా పావు ఎకరాలో పార్కింగ్, మార్కెట్ చుట్టూ 30 ఫీట్ల రోడ్డు నిర్మించారు. మొదటి అంతస్తులో చిన్నపాటి ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేసి కార్పొరేట్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తున్నారు.
రూ.5.75కోట్లతో టౌన్ హాల్..
జిల్లాకేంద్రంలో లలితా కళాతోరణం ఉన్నప్పటికీ సరైన వసతులు లేక కళాకారులు, కవులు, పట్టణ వాసులు ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించిన మంత్రి నిరంజన్రెడ్డి నూతన మార్కెట్యార్డు ప్రారంభం కాగానే పాత మార్కెట్యార్డు స్థలంలో కవులు, కళాకారులు సాంస్కృత్రిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అత్యాధునిక వసతులతో వేదికను సిద్ధం చేయాలని భావించారు. ఈక్రమంలో రూ.5.75కోట్లతో టౌన్ హాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఈ హాల్లో 800 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో 5 గదులతోపాటు హాల్ చుట్టూ వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
రూ.1.50కోట్లతో వైకుంఠధామం..
వనపర్తిలోని పీర్లగుట్ట పాత శ్మశానవాటిక పక్కన ఉన్న స్థలంలో రూ.1.50 కోట్లతో వైకుంఠధామాన్ని నిర్మించారు. ఇందులో ఆహ్లాదాన్ని పంచేలా మొక్క లు, భారీ శివుడి విగ్రహంతోపాటు ప్రహరీ, లోపలికి వచ్చే మార్గంలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉండే క్రమాన్ని వివరించేలా బొమ్మలను పొందుపర్చారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన వారి కోసం వెయింటిం గ్ షెడ్డు, టాయిలెట్స్, మూ డు దహన వాటికలు, అస్తికలను భద్రపరిచే గది, తా గు, వాడుకునేందుకు నీటి సౌకర్యం కల్పించారు.
అందుబాటులోకి తీసుకొస్తాం..
మున్సిపాలిటీలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్ హాల్, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, జంతు జనన నియంత్రణ కేంద్రం వంటి అభివృద్ది పనులు మంత్రి చొరవతో వేగంగా పూర్తయ్యాయి. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పట్టణవాసులకు అన్ని రకాలుగా వినియోగపడుతుంది. కవులు, కళాకారులు, ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలుగా టౌన్హాల్ను తీర్చిదిద్దాం.
– విక్రమ సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి
మంత్రి ముందుచూపుతోనే..
రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణాల సరసన వనపర్తిని నిలపాలన్నదే మంత్రి నిరంజన్రెడ్డి లక్ష్యం. ఆ దిశగా ముందుచూపుతో ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తునారు. పట్టణవాసులకు ఉపయోగపడేలా అధునాతన తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్ హాల్ నిర్మాణం, అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని అందుబాటులో ఉంచాం.
– వాకిటి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్