అయిజ, డిసెంబర్ 20 : తుంగభద్ర నదిపై నిర్మించిన నాగల్దిన్నె వంతెనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు రవాణా పరంగా సేవలు మెరుగుపడతాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్మిగనూర్ నియోజకవర్గంలోని నందవరం మండలం, నాగల్దిన్నె సమీపంలోని తుంగభద్ర నదిపై రూ. 42కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను అలంపూర్, ఎమ్మిగనూర్ ఎమ్మెల్యేలు విజయుడు, ఎర్రకోట చెన్నకేశవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. మూడు రాష్ర్టాల ప్రజల రాకపోకలకు కీలకమైన వారధి నాగల్దిన్నె వంతెన అని పేర్కొన్నారు. 2009అక్టోబర్ 2న తుంగభద్ర నదికి వచ్చిన జల ప్రళయానికి నాగల్దిన్నె వంతెన పూర్తిగా నేలమట్టమైందన్నారు. 2011లోనే అప్పటి సమైక్య ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణానికి రూ.42కోట్లు విడుదల చేసిందన్నారు. అనేక కారణాలతో బ్రిడ్జి నిర్మాణం పనులు కొన్ని అవాంతరాల వల్ల ఆలస్యమైనప్పటికీ సీఎం జగన్మోహన్రెడ్డితో ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వంతెన పనులను పూర్తి చేయించాలని పట్టుదలతో కృషి చేస్తూ నిధుల విడుదలకు చర్యలు తీసుకొని పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర పరిధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించడంతో పనులు వేగిరంగా పూర్తి చేసి, మూడు రాష్ర్టాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. నాగల్దిన్నె వారధితో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు రవాణా పరంగా అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని బీటీ రోడ్డు ఆధునీకరిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అయిజ నుంచి నాగల్దిన్నె వంతెన వరకు బీటీ రోడ్డును డబుల్రోడ్డుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి వివరించారు. అంతకుముందు మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలతో శాస్ర్తోక్తంగా పూజలు చేయించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూల్ జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూల్ కలెక్టర్ గుమ్మళ్ల సృజన, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నేత అగస్త్యరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.