అచ్చంపేట, అక్టోబర్ 9 : 60 ఏండ్ల సమైక్య పాలకుల చేతిలో కరువు, వలసలతో అరిగోస అనుభవించి దగాపడిన నల్లమల ప్రాంతానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణమ్మ తరలిరానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట ఎత్తిపోతల ద్వారా సాగు జలాలను పారించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయనన్నారు. సోమవారం ఉదయం అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్ను జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గువ్వల అమలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు ఈ ప్రాజెక్టు సాధించినందుకు ఇరిగేషన్ అధికారులు, రైతులు ఎమ్మెల్యేపై పూలుచల్లి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును స్వయంగా సీఎం కేసీఆర్ డిజైన్ చేశారన్నారు. ప్రాజెక్టు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అడ్డుకునేందుకు కొందరు కుట్రలకు తెరలేపారని విమర్శించారు. భవిష్యత్లో సమస్యలు లేకుండా ప్రాజెక్టును రెండు ఫేస్లుగా విభజించామని అన్నారు. అసాధ్యమనుకునే అప్పర్ప్లాట్ అమ్రాబాద్, పదరకు సాగునీళ్లు ఇవ్వడం సుసాధ్యం చేసి చేపించామని అన్నారు.
రూ.23వేల కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీటిని బీడు భూముల్లో పారిస్తామన్నారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలకు శుభాకాంక్షలతోపాటు ప్రాజెక్టు మంజూరుకు శ్రమించిన ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడే పుట్టామని చెప్పుకునే ప్రతిపక్షాలు గత పాలకుల అసమర్థతతో నీళ్ల కోసం గోస తీసిన అచ్చంపేట ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం నీళ్లను తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు తూడ్చాలన్న సోయి కూడా లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. ఏండ్లుగా సాగునీటి కోసం అల్లాడుతున్న నల్లమల రైతుల కలసాకారం కానున్నదన్నారు. కృష్ణా జలాలను నల్లమలలో పారించడం తన బాధ్యత అన్నారు. ఈ గొప్ప పుణ్య కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించినా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తానే లిఫ్ట్ పైలాన్ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులకు టెండర్లు, అగ్రిమెంట్ పూర్తయి పనులు శరవేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నీళ్ల కోసం అల్లాడుతున్న అచ్చంపేట నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారం చూపించకుండా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని అచ్చంపేట ప్రాంతానికి తీరని నష్టం కలిగించారని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకుగానూ కృష్ణా జలాలతో రైతుల పాదాలు కడుగుతానని చెప్పారు.
మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం అచ్చంపేటలో జరగాల్సిన మంత్రి కేటీఆర్ సభ వాయిదా పడిందని, రెండ్రోజుల్లో మరో తేదీని ఖరారు చేస్తామని గువ్వల బాలరాజు తెలిపారు. సోమవారం సాయంత్రం బహిరంగసభ జరిగే సభాస్థలి వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. త్వరలో మంత్రి కేటీఆర్చే ప్రగతి సభను భారీ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు, పార్టీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుల ఆలోచనలు శవాలపై పేలాలు తినేలా ఉంటున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో నిలిస్తే.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదన్నారు. టికెట్ల కోసం ఢిల్లీలో పైరవీలు చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మార్కెట్ చైర్పర్సన్ అరుణ, వైస్ చైర్పర్సన్ శైలజారెడ్డి, మాజీ చైర్మన్ తులసీరాం, సర్పంచ్ లోక్యానాయక్, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ రాంబాబు, డీఈ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు పర్వతాలు, పీఏసీసీఎస్ చైర్మన్లు రాజిరెడ్డి, నర్సయ్య యాదవ్, కౌన్సిలర్లు అప్పశివ, సోమ్లానాయక్, రమేశ్రావు, గడ్డం రమేశ్, నిర్మలా బాలరాజు, మన్నుపటేల్, కుత్బుద్దీన్, రమేశ్, నరేశ్, వెంకటేశ్, వరుణ్, గోపాల్ నాయక్, ప్రవీణ్, వంశీ, లింగం తదితరులు పాల్గొన్నారు.