‘కూలడానికి సిద్ధంగా ఉన్న తరగతి గదులు.. చెట్ల కింద చదువులు.. ప్రహరీ లేక పందుల ఆవాసం.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. సరైన బ్లాక్బోర్డులు లేని దుస్థితి.. ఒంటికి వెళ్లాలన్నా ఆరుబయటకే.. విద్యుత్ సౌకర్యం లేక మసకబారిన చదువులు..’ పట్టించుకునేవారు లేక.. అడిగినా నిధులు మంజూరు చేయక పోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సర్కార్ బడుల్లో ఎన్నో సమస్యలు దర్శన మిచ్చేవి.. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అనుకున్నదే తడువుగా ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టారు. రూ.కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలను కల్పించారు. నూతన తరగతి గదులు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, బెంచీలు, బ్లాక్బోర్డులు.. పాఠశాల ఆవరణలో పచ్చదనం, తాగునీటి వసతి.. అధునాతన టాయిలెట్లు, ప్రహరీల నిర్మాణం.. ఇలా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 1,099 పాఠశాలలను ఎంపిక చేయగా, రూ.416.36 కోట్లు విడుదల చేశారు. బుధవారం 99 బడులను ప్రారంభించనున్నారు.
మహబూబ్నగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా పెద్ద భవంతులు.. అన్ని వసతులతో తరగతిగదులు.. ప్రతి గదిలో ఫ్యాన్లు, బెంచీలు, కొత్త బ్లాక్బోర్డులు.. ఆవరణలో పచ్చిక బయళ్లు.. తాగునీటి వసతి.. ఆధునిక వసతులతో మరుగుదొడ్ల నిర్మాణంతో సర్కారు బడుల రూపురేఖలే మారుతున్నాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఆసక్తి కలిగించేలా తీర్చిదిద్దుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రహరీల నిర్మాణానికి నిధులు వస్తే నిర్మాణదశలో ఉండగానే తరగతి గదులు కూలిపోయే దుస్థితి నుంచి ఆహ్లాదకర వాతావరణం వైపు పల్లెబడులు సింగారించుకుంటున్నాయి. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గకేంద్రాల్లో సర్కారు బడుల తీరుచూసి విద్యార్థుల తల్లిదండ్రులు ముచ్చట పడుతున్నారు. ఇది సర్కారు బడేనా అన్నట్లు తీర్చిదిద్దడంతో విద్యార్థుల్లో సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సర్కార్ బడుల రూపురేఖలను మార్చడానికి నడుంబిగించడంతో పాఠశాలలు పూర్తిగా మారిపోయాయి. ఇది మనం చదివిన బడేనా అన్నట్లు తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతగా 1099పాఠశాలలను ఎంపిక చేశారు. అందుకుగానూ రూ.416.36కోట్లు విడుదల చేశారు. అందులో అన్నిహంగులతో సిద్ధమైన 99పాఠశాలలను బుధవారం ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మన ఊరు- మనబడి కింద రూపుదిద్దుకున్న సర్కార్ బడులపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
‘మన ఊరు – మన బడి.. మన బస్తీ – మన బడి’ కింద మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వం మొదటి విడుతగా 291పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తరగతి గదులతోపాటు పాఠశాల ఆవరణ రూపురేఖలు మార్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో 180 ప్రాథమిక, 32 ప్రాథమికోన్నత, 79ఉన్నత పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. మొదటి విడుతగా రూ.148.78కోట్ల నిధులు మంజూరు చేశారు. 20 పాఠశాలలు పారంభానికి సిద్ధమయ్యాయి. పాఠశాలల్లో ఏఏ సౌకర్యాలు మెరుగుపర్చాలో సంబంధిత ఇంజినీర్లు, విద్యాశాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టు మేరకు బడులన్నింటినీ పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న గదులను తొలగించి కొత్త వాటిని నిర్మించడం, కొత్తగా నిర్మించిన వాటికి సౌకర్యాలు కల్పిస్తారు. ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్తుల సహకారంతో పనులు ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కావాల్సిన వసతులన్ని ఈ బడుల్లో కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
వనపర్తి, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన మన ఉరు-మనబడి కార్యక్రమం వనపర్తి జిల్లాలో లక్ష్యానికి చేరువవుతున్నది. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి గ్రామీణ, పట్టణ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు-మన బడి, పట్టణ ప్రాంతాల్లో మన బస్తీ- మనబడి కార్యక్రమం పేరిట కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 28పాఠశాలలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మండలానికి రెండు పాఠశాలల చొప్పున ఎంపిక చేసి 14మండలాల్లో 28 మోడల్ స్కూల్స్గా నిర్మాణం చేసి కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా నిర్మాణం చేశారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలను నిర్మించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అత్యధికంగా విద్యార్థులు నమోదు కలిగిన పాఠశాలలను మొదటి విడుతలో ఎంపిక చేసుకొని నిర్మాణం చేపట్టారు. కార్యక్రమమంతా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 20పాఠశాలలు పూర్తి చేయగా, విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 స్కూళ్లను ఎంపిక చేసి పూర్తిచేశారు. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుద్ధీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పేయింటింగ్, పెద్ద తరహా, చిన్న తరహా మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన గదుల నిర్మాణం, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలు నిర్మించారు. జిల్లాలో మొదటి విడుత కింద రూ.79.99కోట్లు ఖర్చు చేశారు. జిల్లావ్యాప్తంగా 518ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 183పాఠశాలలను ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతంలో మన ఊరు-మన బడి కింద 154పాఠశాలలు, మనబస్తీ -మనబడి ప్రోగ్రాం కింద అర్బన్లో 29పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రస్తుతం ప్రారంభానికి 28 పాఠశాలలను సిద్ధం చేశారు.
నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ (జనవరి 30) : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. మన ఊరు – మనబడి కింద చేపట్టిన అభివృద్ధి పనులతో స్కూళ్లు సరికొత్తగా తయారయ్యాయి. జిల్లాలో రూ.80కోట్లతో 290పాఠశాలలు అభివృద్ధి అవుతున్నాయి. విద్యుత్, కంప్యూటర్, బాత్రూం, మరుగుదొడ్లు, మంచినీరు, కిచెన్షెడ్లు, చెత్తు, గోడల, లీకేజీలు తదితర 12రకాల మరమ్మతులు చేపడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా మేడిపూర్, గగ్గలపల్లిలో పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పాఠశాలల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనుల జాప్యం జరుగుతున్నది. పనులపై జిల్లాలో కలెక్టర్ ఉదయ్కుమార్ పలుమార్లు సమీక్షించారు. ఫలితంగా 90శాతం పనులు పూర్తి కావచ్చాయి. దాదాపు 30పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇందులో మేడిపూర్, భలాన్పల్లి, గోదల్, రేవల్లి, మాదారం, వెల్దండ మండలంలోని పాఠశాలలు రంగులతో ముస్తాబయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించేందుకు మన ఊరు – మన బడి పథకంతో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధుల నిధుల నుంచి 40శాతం పాఠశాలల ఆధునీకరణకు వెచ్చించేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బడుల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలను సమకూర్చుకోనున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యాబోధన జరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరంలో పదిలో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మొత్తం మీద ‘మన ఊరు – మన బడి’ విద్యా వ్యవస్థలో దేశంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. కాగా, జిల్లాలోని 825పాఠశాలలకు గానూ తొలి విడుతలో 290పాఠశాలలకు రూ.80కోట్లు కేటాయించారు. అందులో భాగంగా 30పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
గద్వాల/అలంపూర్, జనవరి 30: మన ఊరు -మన బడి ప్రణాళికతో జిల్లాలోని బడుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తుండడంతో నూతన శోభ సంతరించుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 461ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు -మన బడి కింద అభివృద్ధి చేయడానికి మొదటి విడుతలో 161పాఠశాలలను ఎంపిక చేసి రూ.72.89కోట్లు మంజూరు చేశారు. 118పాఠశాలల్లో రూ.30లక్షలలోపు అభివృద్ధి పనులు ఉండడంతో ప్రారంభమయ్యాయి. మొదటగా పాఠశాలలకు రంగులు వేసి తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో కొన్ని పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఎంపికైనా పాఠశాలల్లో 60శాతం పనులు పూర్తి కాగా అందుకోసం రూ.6.68 కోట్ల మేర ఖర్చు చేశారు. అదేవిధంగా జిల్లాలో 13పాఠశాలల్లో పనులు పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అందులో కాకులారం, అమరవాయి, కలుగోట్ల, ఆర్ గార్లపాడ్, ఎక్లాస్పురం, గుడ్డెందొడ్డి, పాతపాలెం, నందిన్నే, ఎల్కూర్, మద్దూరు, ఉండవెల్లి, భీమవరం, కొండేరు పాఠశాలలు ఉన్నాయి. వీటిని రూ.1.82కోట్లతో పూర్తి చేశారు.
నారాయణపేట, జనవరి 30: ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంతో ఇప్పుడిప్పుడే పాఠశాలలు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కార్యక్రమం కింద నారాయణపేట జిల్లాలో ప్రభుత్వం మొదటి విడుతలో 174పాఠశాలలను ఎంపిక చేసి 169పాఠశాలలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా 8 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్తోపాటు నాణ్యమైన విద్య, హాజరుశాతం పెంచడంతోపాటు అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. మొదటి విడుతలో రూ.34కోట్ల 70లక్షలతో జిల్లాలో 169పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు విడుదలయ్యాయి. వీటిలో రూ.30లక్షలలోపు పనులు అవసరం ఉన్న పాఠశాలలు 141, రూ.30లక్షలకుపైగా పనులు చేసేందుకు మరో 27పాఠశాలలు ఉన్నాయి.
నా కొడుకు 5వ తరగతి చదువుతున్నాడు. గతంలో ప్రభుత్వ పాఠశాలకు పంపాలంటే సరిగా బోధించరని, సౌకర్యాలు లేవని పంపలేదు. దీంతో ప్రైవేట్ పాఠశాలకు పంపించాను. మనఊరు – మనబడి ఏర్పాటుతో సర్కారు బడిలో చేర్పించాను. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వం పాఠశాలల్లో చదువులు చెబుతున్నారు. కొత్త భవనంతోపాటు ఆరుబయటకు వెళ్లకుండా అన్ని సౌకర్యాలు పాఠశాలలోనే కల్పించారు.
– కృష్ణయ్య, విద్యార్థి తండ్రి, హన్వాడ
తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారాయి. వానకాలం వస్తే చాలు గతంలో పాఠశాల ఎదుట నీరు నిలిచేది. పాఠశాల ఎప్పుడు కూలిపోతుందోనని భయం గుప్పిట్లో ఉండేవాళ్లం. కొత్త భవనం నిర్మించిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మారింది. విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.
– రేవతి, సర్పంచ్, హన్వాడ
పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో సకల సదుపాయాలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం. దేశంలోనే నూతన ఒరవడి. ప్రభుత్వం మన ఊరు -మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండడంతో పాఠశాలలకు మహర్దశ సంతరించుకున్నది.
– నర్సింహులు, సర్పంచ్, కాకులారం
పాఠశాలల్లో నెలకొన్న సమస్యల్లో ముఖ్యంగా విద్యుత్, తాగునీరు ట్యాంకుకు మరమ్మతులు పూర్తిచేశారు. గతంలో ఇబ్బందిగా ఉండేది. ఎండా కాలంలో తరగతి గదుల్లో ఉక్కపోతతో ఇబ్బంది ఉండేది. ప్రస్తుతం రూ.12లక్షల నిధులతో పనులు చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మన ఊరు -మనబడి’లో చాలా మంచి పథకం.
– ఆర్ జాన్సన్, హెచ్ఎం, భీమవరం
ప్రభుత్వం మన ఊరు -మనబడి కింద పాఠశాలలు ఎంపిక చేసి సౌకర్యాలు కల్పిస్తుండడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు కల్పిస్తుండడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్శితులవుతున్నారు. మనఊరు -మనబడితో సర్కారు పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి.
– కాలప్ప, హెచ్ఎం, కాకులారం
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పట్టించుకునే వారు కాదు.. మరమ్మతులకు నిధులు కావాలని అడిగినా ఇచ్చే వారు కాదు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి పాఠశాలల్లో అన్నివసతులు కల్పిస్తున్నది. మోడల్ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.30లక్షల వరకు ఖర్చు చేస్తుంది.
– అశోక్కుమార్, ఎంఈవో, అలంపూర్
మన ఊరు – మనబడి పథకం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తుంది. నాగర్కర్నూల్ జిల్లాలో 290పాఠశాలలో అభివృద్ధి పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. మొదటి విడుతలో 30పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాము. ఈ విద్యా సంవత్సరం నాటికి అన్నిపాఠశాల్లో వందశాతం పనులు పూర్తవుతాయి.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్ జిల్లా
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పనులు ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేస్తున్నారు. మనఊరు -మనబడి కింద ఖిల్లాఘణపురంలో నిర్మించిన పాఠశాల భవనం ప్రైవేట్ స్కూల్కు దీటుగా ఉన్నది. కూలిపోయేస్థితిలో ఉన్న పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మించారు. ఈ పాఠశాలలను చూస్తే ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాలనే ఆలోచనే రాదు. విద్యావ్యవస్థ బలపడితే భావి సమాజం బాగుపడుతుంది. – గోపి, ఖిల్లాఘణపురం