యాసంగి సాగు జోరందుకున్నది. వానకాలంలో పంట చేతికి రాగా.. ఇప్పటికే చాలా వరకు విక్రయించారు. ఇక యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. రెండో సీజన్లో నాగర్కర్నూల్ జిల్లాలో 2.99 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 1.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వేరుశనగ సాగుకు కర్షకులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతోపాటు మినుములు, మొక్కజొన్న పంటలు పెరిగాయి. వరి నారు దశలో ఉన్నది. అంచనాలకుమించి పంటలు సాగవుతున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణలో సాగునీటి వనరులు, నిరంతర విద్యుత్, పంట పెట్టుబడికి రైతుబంధు సాయం వంటి పథకాలతోపాటు పండిన ధాన్యాన్ని కొనుగోలుకేంద్రాల్లోనే కొంటున్నది. దీంతో వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
నాగర్కర్నూల్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఖరారు చేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అంతకుమించి ధర పలుకుతుండటంతో రైతులు వానకాలం పంటను సంతోషంతో ముగించుకొన్నారు. ఇక యాసంగి సాగు ముమ్మరంగా చేపడుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వల్ల సాగునీటి కోసం ఎంజీకెల్ఐలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడం, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు, రైతువేదికల ఏర్పాటుతో సాగుకు సలహాలు, కొనుగోలు కేంద్రాల్లాంటివి ఏర్పాటయ్యాయి. దీంతో వెనకబడిన నాగర్కర్నూల్లాంటి ప్రాంతంలోనూ వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. బీడు భూములు పోయి ప్రతి సెంటు, గుంట పంటల సాగు జరుగుతున్నది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాకు మించి పంటల సాగు నమోదవుతున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం కూడా రైతులు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, వరి తదితర సాగు చేపడుతున్నారు.
ప్రస్తుతం వరి నారు దశలోనే ఉంది. ఇలా జిల్లాలో 20వేల ఎకరాల వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో 2.99లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1.07లక్షల ఎకరాల వరకు సాగైనట్లుగా ఏఈవోల ద్వారా వివరాలందాయి. ఇందులో 1.40లక్షల ఎకరాల వరి అంచనాకుగానూ నెలాఖరుకు 40వేల ఎకరాలకుపైగా వరి పంట చేరనున్నది. నెలాఖరులోగా వరి పంటను రికార్డుల్లో నమోదు చేయడంతోపాటు వేరుశనగ, మొక్కజొన్న, కందులు తదితర పంటల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి అధికారుల అంచనా మేరకు యాసంగి సాగు జరగవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 2.99లక్షల ఎకరాలకు గానూ 1.07లక్షల ఎకరాల సాగు జరుగుతున్నట్లుగా అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 2.54లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఇందులో అత్యధికంగా వేరుశనగ, ఆ తర్వాత వరి, మినుములు, మొక్కజొన్నలాంటి పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరమూ అవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశమున్నది. ఇదిలా ఉంటే జిల్లాగా ఆవిర్భవించిన 2016నుంచి ప్రతి సీజన్లోనూ యాసంగి పంటల సాగు పెరుగుతూ వస్తున్నది. 2016లో కేవలం 1.30లక్షల ఎకరాలుండగా గతేడాది 2.55లక్షల ఎకరాలకు చేరితే ఈసారి దాదాపుగా 3లక్షలకు చేరుకోవడం విశేషం. త్వరలో రైతుబంధు సాయం కూడా అందనుండటంతో యాసంగి సీజన్లో పంటల జోష్లో రైతన్నలు మునిగిపోయారు.
యాసంగి సీజన్లో రైతులు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి నేలలను బట్టి వేరుశనగకు బయటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో ఈ సీజన్లో 2.99లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, కందుల్లాంటి పంటలు సాగవుతాయని అంచనా వేశాం. ఇప్పటి వరకు 1.07లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 20వేల ఎకరాల్లో వరి నారుదశలో ఉంది. నెలాఖరుకు 2లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది.
– వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, నాగర్కర్నూల్ జిల్లా