కొల్లాపూర్, నవంబర్ 24 : నాగర్కర్నూల్ జిల్లాలో వానకాలం సీజన్లో వర్షాధారం పంట కింద 3,081 ఎకరాల్లో కంది సాగు చేశారు. అధిక వర్షాలతో కొన్ని చోట్ల కంది పైరుకు నీరు చిచ్చుపట్టగా.. చాలా ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉన్నది. కొల్లాపూర్, పెంట్లవెల్లి, వీపనగండ్ల, చిన్నంబావి, కృష్ణానది తీర గ్రామాల్లోని నల్లరేగడి, మెట్ట పొలాల్లో అత్యధికంగా కంది పంట వేశారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉన్నది. అధిక దిగుబడులు వస్తే నాలుగు డబ్బులు మిగులుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు. ఈ క్రమంలో తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్నది. తెగుళ్ల నివారణకు దుకాణాదారులు, డీలర్లు, దళారులు ఇచ్చే పురుగుల మందులు వాడడం వల్ల పంట దెబ్బతినే ప్రమాదమున్నది.
ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ.. వారు చెప్పిన మందులను వాడడం వల్ల లాభం చేకూరనున్నది. వ్యవసాధికారుల సూచనల ప్రకారం.. తేలికపాటి భూముల్లో కాయ దశలో ఉన్న కంది బెట్టకు గురికావడం, కాయ తొలిచే పురుగు ఆశించి వెర్రితెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నా.. పూత, పిందె రాలే అవకాశం ఉన్నది. నీటి యాజమాన్యం పాటిస్తూ.. పురుగు ఉధృతి అరికట్టేందుకకు మోనోక్రోటోపాస్ 2.0 మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటిలో లేదా ఎండోసల్ఫాన్ 2.0 మి.లీను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
అంతేకాకుండా 10 పీపీఎం గాఢత ఉన్న ప్లానోఫిక్స్ మందు ద్రావణం (2.5 మి.లీను 10 లీటర్ల నీటిలో కలిపి) పిచికారీ చేస్తే పూత రాలడం అరికట్టొచ్చు. కంది పూత, కాయదశలో శనగపచ్చ పురుగు, ఈక పురుగు, కాయతొలిచే పురుగు లేదా మచ్చల పురుగు ఆశించి పంటకు నష్టం కలగొచ్చు. వీటి నివారణకుగానూ వేసవిలో లోతు దుక్కి చేయాలి. కందిని జొన్న, మొక్కజొన్న, సజ్జలో 1:2 నిష్పత్తిలో లేదా వేరుశనగ, సోయాచిక్కుడు, పెసర, మినుము పంటలో 1:7 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవాలి. తిరిగి పూత పట్టే రకాలైన ఎల్ఆర్జి-30, ఎల్ఆర్జి-38 రకాలను సాగు చేయాలి.
కంది విత్తనం విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చడంతోపాటు శనగపచ్చ పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 20 చొప్పున టీ ఆకారపు పక్షి స్థావరాలు అమర్చుకోవాలి. పురుగు గుడ్లు, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. వారం తేడాలో 200 ఎల్ఈఎన్పీవీ ద్రావణాన్ని చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి పైరు మొగ్గ/పూత/కాయ దశల్లో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రెండు లేదా మూడు పురుగు మందులను కలిపి పిచికారీ చేయొద్దు. సాధ్యమైనంత వరకు సింథటిక్ పైరిద్రాయిడ్స్ పిచికారీ చేయొద్దు.
కంది పంటలో సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఆ శించిన మేర దిగుబడులు సాధించే అవకాశం ఉన్నది. పం టలకు ఆశించే పురుగును గమనిస్తూ ఉండి.., వాటి నివారణకు అధికారులు సూచించిన మందులను పిచికారీ చే యాలి. పంట పొలాల్లోకి వెళ్లినప్పుడు రైతులకు కంది పం టలో సస్యరక్షణ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం.
– నాగరాజు, ఏవో, కొల్లాపూర్