జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కలంగా సాగునీరు ఉండడంతో జిల్లాలో యాసంగిలో 69,828 ఎకరాల్లో వరి సాగు చేశారు. దిగుబడి అంచనా మేరకు పీఏసీసీఎస్, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 51 కేంద్రాల ద్వారా 4,177 మంది రైతుల నుంచి 33,318.760 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందుకోసం సుమారు రూ.68.62 కోట్లు వెచ్చించింది. ఇందులో ఇప్పటివరకు 2,918 మంది రైతుల ఖాతాల్లో రూ.44.24 కోట్లు జమచేశారు. మిగిలిన 1,259 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వారికి వారం, పది రోజుల్లో డబ్బులు చెల్లించనున్నారు. ఇక అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంతోపాటు ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళారుల బెడద లేకుండా ఏటా సర్కారే ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతులు గుండెమీద చెయ్యి వేసుకొని పంటలను సాగు చేస్తున్నారు.
గద్వాల, జూన్ 25 : జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలుకాకుండా ప్రభుత్వం ప్రతి ఏటా సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఈసారి యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 51 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. అధికారులు పక్కా ప్రణాళికతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారులు 51 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో పీఏసీసీఎస్, ఐకేపీ, మోప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేశారు. జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఈ యాసంగిలో 69,828 ఎకరాల్లో వరి సాగు చేశారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 33,318 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సాగు అంచనాను బట్టి ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మొత్తంగా 4,177మంది రైతుల నుంచి 3,33,18.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు గానూ అన్నదాతల ఖాతాల్లో సుమారు రూ.68,62,98,408 చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 2,918మంది రైతుల ఖాతాల్లో రూ. 44,24,77,280 జమ చేశారు. ఇంకా 1,259మంది ఖాతాల్లో రూ.24,38,21,128 జమ చేయాల్సి ఉండగా.. వారంలో పూర్తి చేయనున్నట్లు కొనుగోలు కేంద్రం ఇన్చార్జి కనకయ్య తెలిపారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని అధికారులు పారదర్శకంగా కొనుగోలు చేశారు. వానకాలం ప్రారంభమ య్యే నాటికి కొనుగోళ్లు పూర్తి చేశారు. ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. వారం రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నది.