గద్వాల, ఫిబ్రవరి 16 : ఇచ్చిన మాట తప్ప ని నేతగా, ఓ సారి మాట ఇచ్చారంటే కట్టుబడే వ్యక్తిగా నడిగడ్డ ప్రజలకు సుపరిచితుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. గత సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగం సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నా ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. నడిగడ్డ ప్రజలు, రైతులను ఎండబెట్టిన నేతల దగ్గరకు వెళ్లి ఈ ప్రాంత ప్రతిపక్ష ప్రజాప్రతినిధి అక్కడ హారతులు పట్టింది. ఆర్డీఎస్ కింద వాస్తవంగా నడిగడ్డ రైతులకు 87,500 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏనాడు 35వేల ఎకరాలకు మించి నీరు పారలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్రావు దృష్టికి నడిగడ్డ రైతులు తీసుకెళ్లారు. అందుకు చలించి పోయిన కేసీఆర్ ఆనాడు నడిగడ్డ ఆర్డీఎస్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టాలని పూనుకొని జూన్10, 2004లో అలంపూర్ నుంచి ఆర్డీఎస్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఎనిమిది రోజులు పాదయాత్ర చేశారు. అప్పుడు నడిగడ్డ రైతులు ఎదుర్కొంటున్న సాగు, తాగునీరు సమస్యలను రైతులు కేసీఆర్కు వివరించారు. నడిగడ్డ రైతుల సమస్యలు విన్న కేసీఆర్, సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్పదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నడిగడ్డ ప్రజల కోరిక నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.
ఆర్డీఎస్ రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తానని అప్పుడు మాట ఇచ్చారు. అవసరమైతే ఆర్డీఎస్ ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని నడిగడ్డ రైతులను కాపాడుకుంటానని, వారి చివరి ఆయకట్టు వరకు నీరు పారిస్తానని మాట చెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఆర్డీఎస్ రైతుల కష్టాలు తీర్చాలని ఆలోచన చేశారు. దీనికి మార్గం ఆర్డీఎస్ ప్రాజెక్టు నుంచి మనకు వచ్చే నీటి వాటాను తీసుకుంటూనే రైతులకు ఎప్పుడు రెండు పంటలకు నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తుమ్మిళ్ల లిఫ్ట్ను ప్రారంభించారు. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఆర్డీఎస్ రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందించారు. ఆనాడు పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నడిగడ్డ రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఇది ఎప్పటికీ నడిగడ్డ ప్రజలు మరచిపోలేని సంఘటనగా గుర్తుండి పోయింది. గత కాంగ్రెస్ పాలకులకు ఎన్నికల నినాదంగా మారిన గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి ఎడారిగా ఉన్న గట్టు ప్రాంతాన్ని పచ్చని పైర్లతో కళకళలాడే విధంగా చేస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం గట్టు ఎత్తి పోతల పనులు ప్రారంభించి గట్టు ప్రజల చిరకాల వాంఛ తీర్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా నడిగడ్డ విద్యావైద్యరంగాల్లో వెనుకబడిందని భావించి జిల్లాకు నర్సింగ్, మెడికల్ కళాశాలలు మంజూరు చేసి 100 పడకల దవాఖానను 300 పడకలకు పెంచి ఇక్కడి మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకొని నడిగడ్డ ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్.