మహబూబ్నగర్ : ఉద్యోగుల నూతన స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసి ఇంకా విధులలో చేరని వారు తక్షణమే విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా అధికారులతో ఉద్యోగుల కొత్త స్థానిక కేడర్ కేటాయింపు, పోస్టింగ్ ఆర్డర్ల జారీ, విధులలో చేరిన ఉద్యోగుల వివరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోస్టింగ్ ఉత్తర్వులు అందుకొని ఇంకా విధులలో చేరని వారి వివరాలను స్వయంగా సంబంధిత అధికారులే ప్రత్యేక శ్రద్ధ వహించి సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతన లోకల్ కేడర్ కు కేటాయించిన ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా విధుల్లో చేరాలన్నారు.
ఒకవేళ ఏదైనా కారణం చేత ఎవరైనా ఉద్యోగులు ఇంకా విధులలో చేరనట్లయితే వారు విధులలో లేనట్లు పరిగణించడం జరుగుతుందని, వారికి ఎలాంటి జీతం రాదని, ఇందుకు సంబంధిత శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.