మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 25 : మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని ఎస్పీ కె.నర్సింహ హెచ్చరించారు. డ్రైంకన్డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారితోపాటు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్లకు శనివారం మహబూబ్నగర్ ట్రాఫి క్ పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడిపే వారు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపారు. తాగి వాహనం నడపడం వల్ల దేశంలో సంవత్సరానికి లక్షా 50వేల కు టుంబాలు రోడ్డున పడుతున్నాయని, మ ద్యం మత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదన్నారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని తెలిపారు. పోలీసులు ఎప్పుడూ పౌరసమాజానికి మంచి స్నేహితులని, మంచి చేసిన వారికి అండగా ఉంటూ.. చెడు చేసిన వారికి కచ్చితంగా శిక్ష ఉంటుందన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే మొదటిసారిగా కేసులు నమోదు చేస్తామని, మరోమారు పట్టుబడితే మైనర్ తల్లిదండ్రులు, వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18ఏండ్లు పైబడి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలను నడపాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిం చి పట్టుబడిన వారు క్రమశిక్షణతో మెలగాలని జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, కంట్రోల్రూం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అదేవిధంగా సైలెన్సర్లు మార్చి పట్టణంలో పెద్దగా శబ్ధాలు చేస్తున్న ద్విచక్రవాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ టి.మహేశ్, ట్రాఫిక్ సీఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.