కొత్త రైల్వే లైన్తో మార్గం సుగమం
మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వే లైన్పై ఆశలు
మాగనూరు వరకు పూర్తయిన పనులు
నైరుతి రైల్వే పరిధిలో కరటాగి వరకు రైళ్ల రాకపోకలు
కర్ణాటక పరిధిలో వినియోగంలోకి..
తెలంగాణ పరిధిలో మాత్రం రైల్వే శాఖ నిర్లక్ష్యం
మహబూబ్నగర్ మీదుగా మరో రైల్వే లైన్ త్వరలో పూర్తి కానున్నది. కాచిగూడ నుంచి గోవా వెళ్లేందుకు సుమారు 102 కిలోమీటర్ల మేర దూరం తగ్గే మహబూబ్నగర్- మునీరాబాద్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే, కర్ణాటక పరిధిలో నైరుతి రైల్వే ఈ పనులు చేపట్టాయి. దేవరకద్ర నుంచి మాగనూరు వరకు.. కర్ణాటకలోని మునీరాబాద్ సమీపంలో ఉన్న గినిగెర రైల్వే స్టేషన్ నుంచి కరటాగి స్టేషన్ వరకు లైన్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణలో మక్తల్ వరకు ఒక రైలు తిరుగుతుండగా.. కర్ణాటకలోని కరటాగి స్టేషన్ నుంచి హుబ్లీ, బెంగళూరుకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం కరటాగి నుంచి సింధనూరు వరకు 20 కి.మీ. లైన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే మునీరాబాద్-
మహబూబ్నగర్ మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి మరో అడుగు పడనున్నది.
మహబూబ్నగర్, మార్చి 31 : పాలమూరు జిల్లా మీదుగా నూతన రైల్వే లైన్ నిర్మాణం కానున్నది. మహబూబ్నగర్-మునీరాబాద్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ లైన్ పూర్తయితే కాచిగూడ నుంచి గోవాకు వెళ్లేందుకు 102 కిలోమీటర్ల దూరభారం తగ్గనున్నది.
గోవాకు దగ్గరి దారి
మహబూబ్నగర్- మునీరాబాద్ రైల్వేలైన్ అని పేర్కొన్నప్పటికీ.. ఈ లైన్ మాత్రం దేవరకద్ర నుంచి ప్రారంభమై మునీరాబాద్ సమీపంలో ఉన్న గినిగెర రైల్వే స్టేషన్ వద్ద ముగుస్తుంది. దేవరకద్ర నుంచి కృష్ణ స్టేషన్ వరకు 66 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే మక్తల్ వరకు 40 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఒక లోకల్ రైలు మాత్రమే మక్తల్ వరకు తిరుగుతున్నది. ఇక నాలుగు రోజుల కిందట మక్తల్ నుంచి మాగనూరు వరకు కూడా లైన్ పనులు పూర్తయ్యాయి. మరికల్, మక్తల్, జక్లేర్, మాగనూరు రైల్వేస్టేషన్ భవనాల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఇక మాగనూరు నుంచి కృష్ణ రైల్వేస్టేషన్ వరకు 13 కి.మీ. మేర పనులు పూర్తయితే… మహబూబ్నగర్ నుంచి రాయిచూర్ వరకు లైన్ పూర్తయి రైళ్ల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. ఈ లైన్ పూర్తయితే గోవా వెళ్లేందుకు దగ్గరి మార్గం కానున్నది. ఇప్పటి వరకు ఉన్న రైల్వేలైన్తో పోలిస్తే చాలా కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
మునీరాబాద్ నుంచి..
నైరుతి రైల్వే పరిధిలో ఉండే మునీరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహబూబ్నగర్ వరకు నిర్మాణమయ్యే ఈ పనులు.. మునీరాబాద్కు సమీపంలో ఉండే గినిగెర రైల్వే స్టేషన్ నుంచి కరటాగి స్టేషన్ వరకు నిర్మాణ పనులు పూర్తయి రైళ్లు కూడా తిరుగుతున్నాయి. కరటాగి, గంగావతి, గినిగెర మీదుగా హుబ్లీ, బెంగళూరుకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరటాగి రైల్వే స్టేషన్ నుంచి సింధనూరు స్టేషన్ వరకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సింధనూరు, మాన్వి, కల్లూరు మీదు గా రాయిచూర్ వరకు మిగతా పనులు ఈ ఏడాదికి పూర్తి చేసే అవకాశం ఉన్నదని నైరుతి రైల్వే శాఖాధికారులు పేర్కొంటున్నా రు. ఇప్పటి వరకు గంగావతి-కరటాగి సెక్షన్ ప్రారంభించి రైళ్లను ప్రారంభించారు. కరటాగి-సింధనూరు (20 కి.మీ. లై న్) సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కళ్యాణ-కర్ణాటక ప్రాంతంలో వ్యాపార, వాణిజ్యం, కనెక్టివిటీకి ఈ మార్గం ఊతమిస్తుందని అక్కడి అధికారులు తెలిపారు. మహబూబ్నగర్-మునీరాబాద్ మధ్య 1997-98 సంవత్సరంలో 247 కి.మీ. మేర రూ.1,723 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే లైన్ మంజూరైంది.
ఇది దేవరకద్ర-గినిగెర రైల్వేలైన్ మాత్రమే..
మహబూబ్నగర్- మునీరాబాద్ అని వాడుకలో పిలుస్తున్నా.. ఈ రైల్వే లైన్ మాత్రం దేవరకద్ర-గినిగెర స్టేషన్ల మధ్యనే నిర్మాణంలో ఉన్నది. దేవరకద్ర, గినిగెర అనే స్టేషన్లు పెద్దగా ప్రాచూర్యంలో లేనందున మునీరాబాద్- మహబూబ్నగర్ పేరిట లైన్ను పిలుస్తారు. గినిగరా నుంచి మునీరాబాద్ కేవలం 10 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక మహబూబ్నగర్కు దేవరకద్ర 24 కి.మీ. దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్-కర్నూల్ సెక్షన్లో ఉన్న దేవరకద్ర స్టేషన్ నుంచి ప్రారంభమై.. గుంతకల్- వాడి సెక్షన్లో కొంత దూరం (కృష్ణా నుంచి రాయిచూరు వరకు) ప్రయాణించి రాయిచూర్, మాన్వి, సింధనూరు, గంగావతి, కొప్పల్ మీదుగా గుంతకల్- హుబ్లీ సెక్షన్లో ఉన్న గినిగెర వరకు చేరుకుంటుంది. మహబూబ్నగర్- మునీరాబాద్ మధ్య 244 కి.మీ. ఈ లైన్ను రూ.1723 కోట్ల వ్యయంతో చేపట్టారు. దేవరకద్ర- కృష్ణ మధ్య 66 కి.మీ.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.372 కోట్లతో పనులు చేస్తున్నారు. రాయిచూర్-మునీరాబాద్ వరకు 178 కి.మీ. నైరుతి రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఇటు తెలంగాణ వైపున దేవరకద్ర నుంచి పనులు ప్రారంభించగా.. కర్ణాటక వైపున గినిగెర నుంచి పనులు ప్రారంభించి కరటాగి స్టేషన్ వరకు పూర్తి చేశారు. కరటాగి నుంచి హుబ్లీ-బెంగళూరు వైపు నిత్యం మూడు రైళ్లను నడుపుతున్నారు. మరోవైపు దేవరకద్ర-మక్తల్ మధ్య 40 కి.మీ. మేర పనులు పూర్తయినా నేటికీ దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేళాపాలా లేకుండా అర్ధరాత్రి వేళ కాచిగూడ నుంచి మక్తల్ వరకు వారానికి రెండ్రోజులు ఓ ప్యాసింజర్ రైలును నడుపుతున్నారు. ఈ రైళ్లో ప్రయాణికులే కనిపించరు. ఇటీవలే మక్తల్ నుంచి మాగనూరు వరకు కూడా పనులు లైన్ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం కృష్ణా నుంచి మాగనూరు వరకు 13 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి.
పూర్తి కావాల్సిన పనులు
దేవరకద్ర-గినిగెర స్టేషన్ల మధ్య 244 కి.మీ. లైన్ పనుల ను కర్ణాటక నైరుతి రైల్వే, తెలంగాణలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో దేవరకద్ర నుంచి మాగనూరు వరకు పనులు పూర్తవ్వగా.. మాగనూరు నుంచి కృష్ణా వరకు కేవలం 13 కి.మీ. పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉన్నది. ఇక కర్ణాటక పరిధిలో గినిగెరా నుంచి కరటాగి వరకు 65 కి.మీ. మేర పనులు పూర్తయి రైళ్లు కూడా తిరుగుతున్నాయి. ప్రస్తుతం కరటాగి నుంచి సింధనూరు మధ్య సుమారు 20 కి.మీ. మేర పనులు వేగంగా జరుగుతున్నాయి. సింధనూరు నుంచి మాన్వికి, అక్కడి నుంచి రాయిచూరుకు మరో 93 కి.మీ. దూరం పనులు జరగాల్సి ఉన్నది. ఈ లైన్లో ప్రధానంగా పనులు కొనసాగుతున్నది మాత్రం కరటాగి-రాయిచూర్ మధ్యే. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతోనే పనులు చేపట్టినట్లు నైరుతి రైల్వే శాఖాధికారులు తెలిపారు.
దేవరకద్ర- గినిగెర లైన్ పూర్తయితే..
సికింద్రాబాద్ నుంచి హుబ్లీ, గోవా వెళ్లేందుకు ప్రస్తుతం వాడి, గుల్బర్గా లేదా యాద్గీర్ మీదుగా వెళ్లాల్సి ఉన్నది. లేదంటే మహబూబ్ నగర్, కర్నూల్, గుంతకల్, బళ్లారి మీదుగా హుబ్లీ టు గోవా వెళ్లాలి. గుంతకల్ మీదుగా వెళ్తే 823 కి.మీ. అవుతుంది. వికారాబాద్, వాడి, గుల్బర్గా, బీజాపూర్ మీదుగా హుబ్లీ వెళ్లి గోవా వెళ్తే 861 కి.మీ. దూరం ఉంటుంది. రెండు మార్గాల్లో దాదాపుగా 20 గంటల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం నిర్మితమవుతున్న దేవరకద్ర-గినిగెరా లైన్ పూర్తయితే చాలా దగ్గర మార్గం ఏర్పడనున్నది. సుమారు 102 కి.మీ. దూరం తగ్గనున్నది.
ఎక్కడెక్కడికి వెళ్లొచ్చు..
హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్, మక్తల్, కృష్ణా, రాయిచూర్ మీదుగా మాన్వి, సింధనూరు, గంగావతి, మునీరాబాద్, కొప్పల్, గదగ్, హుబ్లీ, గోవా వెళ్లవచ్చు. వెనుకబడిన మహబూబ్నగర్, నారాయణపేట, రాయిచూర్, కొప్పల్ జిల్లాలకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. హంపి, గోకర్ణ, గోవా వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ మార్గం ఎంతో ఉపయోగంగా మారనున్నది. ఈ లైన్ వల్ల దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు రైల్వే సదుపాయం కలగనున్నది. తెలంగాణ, ఏపీ నుంచి గోవా వెళ్లేందుకు దగ్గరి మార్గం అందుబాటులోకి రానున్నది.