మరో రెండు రోజులు వానలే వానలు
భూత్పూర్ రిజర్వాయర్ గ్రావిటీ కేనాల్కు గండి
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లు, ఏస్పీలు
మహబూబ్నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కురిసిన వానకు రహదారులు కాల్వలను తలపించాయి. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్కు గండి పడటంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించారు. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదుల్లో ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. సంగంబండ రిజర్వాయర్తోపాటు కోయిల్సాగర్ ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సూచించారు.
పాలమూరులో భారీ వర్షం
మహబూబ్నగర్ అర్బన్, రూరల్ మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీవర్షం కురిసింది. భూత్పూర్లో అత్యధికంగా 7సెంటీమీటర్ల వర్షం కురిసింది. దామరగిద్దలో 68.00మి.మీ, జడ్చర్లలో 63.5మి.మీ, తిమ్మాజిపేటలో 63.0మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డికాలనీ, శ్రీనివాసకాలనీ, టీచర్స్కాలనీతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు పాడుబడిన ఇండ్లల్లో ఉండొద్దని, అలాంటి వాటిని గుర్తించి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. వాగులు, వంకల వద్ద పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.