ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత గౌరవం దక్కింది. బహుభాషా కోవిదుడిగా, ఆర్థిక సంస్కరణ విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహోన్నతుడికి భారతరత్న పురస్కారం లభించింది. తెలుగు రాష్ర్టాల నుంచి తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాజకీయ, వివిధ సంఘాల నాయకులు, కవులు, రచయితలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
వనపర్తి, ఫిబ్రవరి 9 : దేశంలోని ప్రముఖులైన ఎంఎస్ స్వామినాథన్, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావుకు భారతరత్న ప్రకటించ డం హర్షణీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఎంఎస్ స్వామినాథన్ బతికుండగానే ఈ అవార్డు అందించాల్సి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి ఈ పురస్కారం రావడం చాలా సంతోషకరమైనదన్నారు.