మూసాపేట(అడ్డాకుల), మే 21 : ఉమ్మడి అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభ త్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొన్నకల్కు చెందిన రైతు చంద్రారెడ్డి పాడిగేదె పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పిడుగుపాటు సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గేదె విలువ దాదాపు రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయారు. దాసరిపల్లిలో భారీ చెట్లు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
విద్యుత్ స్తంభాలపై చెట్లకొమ్మలు పడడంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాసరిపల్లి, వేముల, జా నంపేట, పోల్కంపల్లి, నందిపేట, అడ్డాకుల, పెద్దమునగల్చేడ్, కందూరు, గుడిబండ, పొన్నకల్ తదితర గ్రామాల్లో గాలివానకు మామిడికాయలు నేలరాలడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. అదేవిధంగా ఇండ్లపై వేసిన రేకులు, కవర్లు గాలికి కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా సంభవించిన గాలివాన రైతులతోపాటు ప్రజలకు నష్టం చేకూర్చింది.