జడ్చర్లటౌన్, జూలై 16 : పండించిన మక్కలను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.. మక్కల కొనుగోలు కేంద్రాల్లో మక్కల కొనకపోవడంతో రైతులు రోడ్లమీదకొచ్చారు.. ఏలాగోలా మక్కలను అమ్ముకున్న రైతులకు రెండు నెలల తర్వాత డబ్బులొచ్చాయి. కానీ మక్కల తూకం తగ్గిందంటూ మార్కెఫెడ్ అధికారులు రైతులపై భారం వేశారు. అమ్మిన మక్కలకు సరిపడ డబ్బులు రైతుల ఖాతాల్లో పడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎన్ రాధ అనే రైతు జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో క్వింటాకు రూ.2400 చొప్పున 253 బస్తాల మక్కలు అమ్మింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తూకం వేసి 253 బస్తాల మక్కలకు సంబంధించి రసీదు ఇచ్చారు.
తీరా రెండు నెలల తర్వాత 223 బస్తాల మక్కలకు గానూ రూ.2,67,600 డబ్బులు ఖాతాలో జమ చేసినట్లు మార్కెఫెడ్ నుంచి మెసేజ్ రావటంతో ఆమె అవాక్కయింది. అదే విధంగా డీ నరేశ్ అనే రైతు 106 బస్తాలు అమ్మితే.. 104 బస్తాలకు మాత్రమే డబ్బులు రూ.1,24,800లు పడ్డాయి. అలాగే లక్ష్మమ్మ అనే రైతు 153 బస్తాలు మక్కలు అమ్మితే 148 బస్తాలకు మాత్రమే రూ.1,77,600లు పడ్డాయి.. ఇలా మండలంలోని దాదాపు వంద మంది రైతులకు అమ్మిన మక్కలకు సరిపడా డబ్బులు రాకపోవటమే గాకుండా తక్కువ డబ్బులు ఖాతాల్లో పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తమ వద్ద కొన్న మక్కలకు సరిపడా తూకం ఉన్నట్లు నిర్వాహకులే రసీదు ఇచ్చారు.
ఇప్పుడేమో మక్కల తూకం తగ్గిందని తమకు ఇచ్చే డబ్బులను కట్ చేయడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు నానా అవస్థలు పడితే.. తూకం తగ్గిందంటూ పంటకు సరిపడా డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పీఏసీసీఎస్ సీఈవో యాదగిరిని వివరణ కోరగా బాదేపల్లి పీఏసీసీఎస్ పరిధిలో 75 వేలు క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయటం జరిగింది. రైతుల నుంచి మక్కలు కొని తూకం వేసి రసీదులు ఇవ్వటం జరిగింది. వేబ్రిడ్జిలో తూకం తగ్గితే రైతులకు ఏలాంటి సంబంధం ఉండదు. మక్కలకు సంబంధించి డబ్బులు తక్కువగా పడ్డాయని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
మక్కల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి మక్కలు కొన్న సమయంలో వేసిన తూకం ప్రకారం రసీదులు ఇచ్చారు. కొనుగోలు కేంద్రం నుంచి వేబ్రిడ్జి కాంటాకు వెళ్లే వరకు మక్కల తూకం తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రం నుంచి మార్కెఫెడ్ గోదాం తరలించే క్రమంలోనే తూకంలో మార్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్కల కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.