వనపర్తి టౌన్, జూన్ 18 : జిల్లా కేంద్రంలోని రాజనగరంలో గల రామకృష్ణేశ్వర ఆలయంలో ఆదివారం చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దంపతులు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి దంపతులు, కౌన్సిలర్ నాగన్నయాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమవాస్యను భాను అమావాస్యగా పిలుస్తారని, చాలా అరుదుగా వస్తుందని అర్చకులు తెలిపారు. సామూహికంగా అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 54జంటలతో ఈ చండీయాగం నిర్వహించినట్లు తెలిపారు. సంతానం లేక బాధపడేవారు, వివాహాలు కానివారు, కుజదోషం, రాహుకేతువుల సర్పదోశం తీరిపోతాయనే నమ్మకంతో యాగం చేస్తారని అర్చకుడు పల్లా సాయికుమార్ చెప్పా రు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి ఆలయ అభివృద్ధికి విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, మాజీ సర్పంచ్ నాగేంద్రమ్మ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.