పెబ్బేరు, మార్చి 30 : రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లూటీ చేస్తున్న ముఠాను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో తొమ్మిది చోట్ల చోరీలకు పాల్పడగా వారి నుంచి రూ.3.40లక్షల నగదు సహా వారు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్రెడ్డి వెల్లడించారు. ఎస్సై కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లికి చెందిన కొయ్య ప్రణయ్రెడ్డి అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురితో ముఠాగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నాడు.
శనివారం పెబ్బేరు జాతీయ రహదారిపై ఉన్న బైపాస్ వద్ద అశోక్ లేలాండ్ వాహనంతో ఈ నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో అసలు గుట్టు అంతా బయటపడింది. వీరంతా జిల్లా పరిధిలోని చిన్నంబావి మండలంలో మూడు చోట్ల, కొత్తకోట, వీపనగండ్ల, శ్రీరంగాపురం, పాన్గల్ మండలాల్లో ఒక్కోచోట, పెబ్బేరు మండలంలో రెండు చోట్ల.. మొత్తం 9 ప్రాంతాల్లో ధాన్యా న్ని చోరీ చేసినట్ల అంగీకరించారు.
చోరీ చేసిన వడ్లను బాదేపల్లిలో విక్రయించి, ముఠా నాయకుడైన కొయ్య ప్రణయ్రెడ్డికి డబ్బు ఇస్తే ఆయన మిగతా వారికి నగదు పంపిణీ చేస్తాడని తేలింది. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.