జడ్చర్ల, మార్చి 26 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ హంగులతో రూపుదిద్దుకొని నూతన శోభను సంతరించుకున్నాయి. జడ్చర్ల మున్సిపాటీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మనబస్తీ-మనబడి కార్యక్రమానికి ఎంపిక కాగా, రూ.68లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పాఠశాలకు నూతన భవనంతోపాటు ప్రహరీ, మంచినీటి వసతి, వంటగది, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, తరగతిగదుల్లో గ్రీన్బోర్డులు, డ్యుయెల్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న పాఠశాలను ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో 156మంది విద్యార్థులు చదువుతుండగా, సకల సౌకర్యాలు అందుబాటులోకి రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి మెరుగైన విద్య అందించడంతోపాటు క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారు. గురుకులాల్లో సీట్లు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 8మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యా రు. పాఠశాలలో ఆంగ్లమాధ్యమం ప్రారంభించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది.
వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి మండలం, మున్సిపాలిటీలో రెండు పాఠశాలల చొప్పున మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమానికి మొద టి విడుతగా ఎంపికయ్యాయి. విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పనుల పూర్తిపై ప్రజాప్రతినిధులతోపాటు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది..
కార్పొరేట్కు దీటుగా రూపుదిద్దుకున్న పాఠశాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఆంగ్లమాధ్యమం ప్రారంభించడంతో ఒకటోతరగతిలో 25మంది విద్యార్థులు చేరా రు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
–శారద, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం