గద్వాల అర్బన్, ఏప్రిల్ 11 : ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు…యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ప్రస్తుతం జిల్లా లో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎంతలా అంటే…ఖాళీ ప్రభుత్వం స్థలం కనబడిందంటే చాలు…అధికారులు అండదండలతో నకీలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలంపై పట్టు సాధిస్తున్నరన్న పుకార్లు వినబడుతున్నాయి. కబ్జాకు గురిచేసిన స్థలాలను వెంచర్లు వేసి రూ.కోట్లు గడిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా 10శాతం స్థలాలు కూడా చివరికి కబ్జా చేసి వాటిలో పునాదులు నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సర్వే నెం 721 లో ఉన్న 10 శాతం స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్ చేసి విక్రయించిన్నట్లు సమాచారం. అలాగే ప్రియదర్శిని కాలేజి ఎదురుగా ఉన్న సర్వే నెం 723/4,724/4 మిగులు స్థలాలను కబ్జా చేశారు. సర్వే నెం 740లోని వెంచర్లో 10శాతం కబ్జా చేసి ఆ స్థలాన్ని కిరాయికి ఇచ్చినట్లు తెలిసింది. అలాగే సర్వే నెం 781/పీ, 786/పీ వెంచర్ల్లో గతంలో 40ఫీట్లు రోడ్డు వదిలి వేయగా… తాజాగా మళ్లీ రోడ్డును కబ్జా చేసి ప్లాట్ చేసినట్లు తెలిసింది. తాజాగా సర్వే నెం 841/సీ 23గుంటల భూమి ఈ మధ్యే నకీలి పత్రాలు సృష్టించి కబ్జా రాయుళ్లు తమ పేరు మీద మార్చుకున్నట్లు ప్రస్తుతం జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సర్వే నెంబర్ 49లో 12 గుంటల స్థలం, సర్వే నెం 42లో 10శాతం స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. అలాగే సర్వే నెం 388లో దాదాపు 15ఎకరాలకు పైగా స్థలాలను కబ్జా చేసి ప్లాట్ చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. కబ్జా రాయుళ్ల్లు యథేచ్ఛగా అధికారుల అండదండలతో కబ్జా చేసి రూ.కోట్లు గడిసున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా రాయుళ్లకు ప్రభుత్వ అధికారులే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెర ముందు కబ్జా రాయుళ్ల్లు….తెర వెనుక ప్రభుత్వ అధికారులు అన్న విధంగా జిల్లాలో ప్రభుత్వ స్థలాలపై కన్ను వేసి కబ్జాలకు పాల్పతున్నట్లు సమాచారం.