పెబ్బేరు, మే 9 : కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన కులాల అభివృద్ధికి.. వారు కొనసాగిస్తున్న వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ, గొల్ల కురుమల కోసం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇ దే కోవలో సంప్రదాయ కులవృత్తులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ను అందజేస్తూ ఉదారతను చాటుతున్నది. ఈ నేపథ్యంలోనే నాయీబ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్కటింగ్ సెలూన్లు, రజకులు నిర్వహిస్తున్న లాండ్రీ షాపులు లేదా ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల కరెంట్ను ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ వృత్తి లో కొనసాగుతున్న వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా, వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన ఉచిత విద్యు త్ పథకం సత్ఫలితాలినిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తింపు పొందిన రెండు సామాజికవర్గాలు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందుతున్నాయి. జిల్లాలో 397 సెలూన్లు, 899 లాండ్రీలకు మొత్తం 1,296 షాపులకు ప్రస్తుతం ఉచిత కరెంటు అందుతున్నది. ఈ పథకాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది. విద్యుత్ వినియోగం 250 యూనిట్లకు మించితే అదనపు వినియోగానికి అయ్యే బిల్లు లబ్ధిదారే భరించాల్సి ఉంటుంది.
ఆర్థికాభివృద్ధికి చేయూత..
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం 2021 జూన్ 1 నుంచి ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ షాపులకు విద్యుత్ ప్రధాన అవసరం కాగా ప్రతినెలా క రెంటు బిల్లు తడిసి మోపెడయ్యేది. ఒక్కో షాపునకు రూ.500 నుంచి రూ.1,500 వరకు బిల్లు వచ్చేది. నెలనెలా కరెంటు బిల్లులు చెల్లించ డం యజమానులకు పెను భారమవుతుండగా.. ప్రభుత్వం కల్పించిన 250 యూనిట్ల ఉచిత వి ద్యుత్ పథకం ఊరటనిస్తున్నది. అదేవిధంగా విద్యుత్ మీటరు, స్విచ్బోర్డు, వైరింగ్తోపాటు కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వడం గమనార్హం.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
నాయీబ్రాహ్మణులు, రజకులు తమ షాపులకు ఉచిత విద్యుత్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన అనంతరం అర్హత పొందిన వాటిని నేరుగా డిస్కంకు లింక్ చేస్తాం. మీటరు, స్విచ్బోర్డు, వైర్ వంటివి సిబ్బంది ఉచితంగానే అమర్చుతారు. ఇప్పటివరకు పెండింగ్ దరఖాస్తులు లేకపోగా పథకం విజయవంతంగా అమలవుతున్నది.
– అనిల్ ప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి
రూ.వెయ్యి ఆదా..
మా లాండ్రీ షాపులో రెండు ఇస్త్రీ పెట్టెలు వాడతాం. ప్రతి నెలా రూ.వెయ్యి బిల్లు వచ్చేది. ఇప్పుడు ఉచిత కరెంటుతోఆ డబ్బులు ఆదా అవుతున్నాయి. మా లాంటి వారికి ఈ పథకం గొప్ప వరం లాంటిది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ, రుణ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నా.
– అలివేలమ్మ, లాండ్రీ షాపు యజమాని
సీఎం కేసీఆర్ది గొప్ప మనసు..
సమాజంలో వెనుకబడిన కుల వృత్తులను ఆదుకునేందుకుప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు పథకం ఎంతో ఉపకరిస్తున్నది. సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో అట్టడుగువర్గాల అభ్యున్నతికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ఆలోచనల నుంచి ప్రవేశపెట్టిన పథకాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.
– సదుర్ల శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు
బిల్లు బాధ తప్పింది.. ఉచిత కరెంటు పథకం
అమలుకు ముందు ప్రతి నెలా బిల్లు చెల్లించేందుకు ఇబ్బంది పడేవాళ్లం. షాపు కిరాయి, కాస్మోటిక్స్, నిర్వహణ ఖర్చులతోపాటు కరెంటు బిల్లు చెల్లింపు భారంగా ఉండేది. ప్రస్తు
తం ఈ పథకం అమలుతో షాపుల యజమానులకు ఆత్మవిశ్వాసం పెరిగింది.
– నారాయణదాసు బాలకృష్ణ,సెలూన్ షాపు యజమాని